డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నం
ABN, First Publish Date - 2021-03-17T08:16:45+05:30
నిర్మల్ జిల్లా భైంసాలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్దళ్ చేపట్టిన డీజీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.
- వీహెచ్పీ, బజరంగ్దళ్ కార్యకర్తల అరెస్టు
- అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన నిరసనకారులు
- నిర్మల్ ఎస్పీ క్యాంపు ఆఫీస్ ఎదుట హిందూ వాహిని కార్యకర్తల ధర్నా
హైదరాబాద్/ఖైరతాబాద్/నిర్మల్/టౌన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా భైంసాలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్దళ్ చేపట్టిన డీజీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. భైంసా ఘటనలో పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమ వారిపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వీహెచ్పీ, బజరంగ్ దళ్ మంగళవారం డీజీపీ కార్యాలయ మట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు.. దశలవారీగా ముట్టడికి వచ్చిన వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 200 మందికిపైగా కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత మంది అసెంబ్లీ ముట్టడికి సైతం ప్రయత్నించడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. వీహెచ్పీ రాష్ట్ర చీఫ్ రామరాజును ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగానే అరెస్టులు: ఎస్పీ
నిర్మల్ జిల్లా భైంసాలో హిందువులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు హిందూవాహిని కార్యకర్తలు ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విష్ణు వారియర్ హిందువాహిని శ్రేణులతో మాట్లాడుతూ.. సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను అరెస్టు చేశామన్నారు. భైంసా ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి కిరణ్ కారే ప్రభాకర్ను నియమిస్తూ డీజీపీ మహేందర్రెడ్డి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2021-03-17T08:16:45+05:30 IST