Posani Krishna Murali ఇంటిపై రాళ్ల దాడి.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
ABN, First Publish Date - 2021-09-30T17:20:38+05:30
సినీ నటుడు, వైసీపీ అభిమాని పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్: సినీ నటుడు, వైసీపీ అభిమాని పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమీర్పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో రాళ్లతో దాడి చేశారు. పోసానిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. దీంతో భయాందోళనకు గురైన వాచ్మన్.. ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాచ్మన్ ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోసాని బూతుల వర్షం కురిపించడంతో జనసేన కార్యకర్తలు-పోసాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి జరగడం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి పోసాని కృష్ణమురళి కుటుంబం 8 నెలలుగా వేరే చోట నివాసం ఉంటోంది. ఆ విషయం తెలియని దుండగులు, పోసాని ఎల్లారెడ్డిగూడలోని ఇంట్లోనే ఉంటున్నారనుకుని దాడికి పాల్పడ్డారు. పోసానిని బూతులు తిడుతూ రాళ్లు, ఇటుకలు విసిరారని పోలీసులతో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Updated Date - 2021-09-30T17:20:38+05:30 IST