20 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి
ABN, First Publish Date - 2021-06-17T05:22:16+05:30
20 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి
వరంగల్అర్బన్ అగ్రికల్చర్, జూన్ 16 : ఈ యేడు 20 లక్షల ఎకరాలకు కంది సాగుపెంచాలని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి రైతులకు సూచించారు. బుధవారం వరంగల్ వ్యవసాయ పాంత్రీయ పరిశోధన స్థానంలో అఖిలభారత సమన్వయ పరిశోధన పథకం కింద కంది పంటలో ప్రథమశ్రేణి ప్రదర్శన కార్యక్రమంతో పాటు రైతులకు కంది పంట సాగుపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమారెడ్డి హాజరై మాట్లాడుతూ... రాష్ట్రంలో వరి, పత్తి తర్వాత విస్తీర్ణంలో అతిపెద్ద పంటగా కంది పంట చోటు చేసుకోబోతుందన్నారు. అపరాల పంటలకు ముఖ్యంగా గాలిలోని నత్రజని స్థిరీకరించే శక్తి ఉండడం, కంది పంటకు ఆకురాల్చే గుణం ఉండడంవల్ల ఇది భూమికి చేరి సేంద్రియ కర్బన పదార్థం మెరుగుపడుతుందని, తద్వారా నేల భూభౌతిక స్థితి మెరుగు పడుతుందని సూచించారు.
అనంతరం వరంగల్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.బలరాం, డాక్టర్ ఎన్.సంధ్య వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నూతనంగా విడుదలైన కందిలో రకాలు గురించి వివరించారు. నేలలు, విత్తన మోతాదు, విత్తే విధానం, కలుపు యాజమాన్యం, ఎరువులు, నీటి యాజమాన్యం, పంటకొత గురించి ప్రథమశ్రేణి ఇన్చార్జి డాక్టర్ ఎం.మధు వివరించారు. చీడపీడల యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ చర్యలను డాక్టర్ జి.పద్మజ వివరించారు. కార్యక్రమంలో గీసుకొండ మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి విజయ్నాయక్, స్టేషన్ఘన్పూర్, చిల్పూర్, గీసుకొండ, జఫర్గఢ్ మండలాల నుంచి సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-17T05:22:16+05:30 IST