అక్కాపూర్ హైవే పక్కనే దర్జాగా ఆక్రమణ
ABN, First Publish Date - 2021-02-04T05:15:43+05:30
గత కొంతకాలం నుంచి నిర్మల్ జిల్లాలో యథేచ్చగా సర్కారు భూములను కబ్జాచేస్తున్న కొంతమంది రియల్ వ్యా పారుల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించబోతున్నారు.
భూమి విలువ రూ.4 కోట్లకు పైగానే
పట్టాభూమి సర్వేనంబర్తో వెంచర్ ఏర్పాటు
ఇప్పటికే పూర్తయిన అమ్మకాలు
ఫిర్యాదుతో రంగంలోకి దిగుతున్న రెవెన్యూ అధికారులు
ఇక కూపీ లాగితే డొంక కదలబోతున్న వైనం
నిర్మల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : గత కొంతకాలం నుంచి నిర్మల్ జిల్లాలో యథేచ్చగా సర్కారు భూములను కబ్జాచేస్తున్న కొంతమంది రియల్ వ్యా పారుల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేసిన వారందరి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లా కేంద్రంతో పాటు సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక ఎకరం భూమి రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఇలా భూముల ధర లు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో కొంతమంది రియ ల్ వ్యాపారులు కింది స్థాయి రెవెన్యూశాఖ సిబ్బందితో మిలాఖతై సర్కారు భూములను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా సర్కారు భూములు ఆక్రమణకు గురి కాగా తాజాగా పట్టణానికి సమీపంలోని అక్కాపూర్ హైవే కు ఆనుకొని ఉన్న ఓ పట్టాభూమి పక్కన గల రెండు ఎకరాల సర్కారుభూమిని దర్జాగా కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పట్టాభూమి పక్కనే ఉన్న సర్కారు భూమిని కలుపుకొని సదరు రియల్టర్ ఈ వెంఛర్ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్రంగంలో కొంత అనుభవం ఉన్న పట్టణంలోని బుధవార్పేట్కు చెందిన ఈ రియల్టర్ మామడ మండలానికి చెందిన రిటైర్డ్ రెవె న్యూ అధికారితో మిలాఖతై ఈ అక్రమ తతంగానికి తెర లేపినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు రిటైర్డ్ రెవెన్యూ అధికారి అలాగే ఈ రియల్టర్ ఇప్పటికే చాలా ప్రభుత్వ భూములను పట్టాభూముల పేరిటా, వెంచర్లుగా మార్చేరన్నాంటున్నారు. అయితే పట్టణానికి ఆనుకొని రెవెన్యూ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న అక్కాపూర్ హైవే పక్కనే పెద్ద మొత్తంలో ప్రభుత్వభూమికి ఎసరు పెట్టిన వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా ఈ తతంగంపై పలువురు ఇటీవల జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదులు చేయడమే కాకుండా రెవెన్యూలోని విజిలెన్స్ విభాగానికి కూడా సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కిందిస్థాయి అధికారులకు ఆదే శాలు జారీ చేసినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత అధికారులు అక్కాపూర్ హైవే పక్క న ఆక్రమణకు గురైన సర్కారు భూమిపై విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి తీగలాగితే సర్కారు భూముల అక్రమాల డోంక కదలబోతున్నట్లు చెబుతున్నారు.
పక్కా ప్లాన్తో..
కాగా అక్కాపూర్ హైవేకు ఆనుకొని ఉన్న దాదాపు రెండు ఎకరాల విలువైన సర్కారుభూమిని ఆక్రమించుకునేందుకు రియల్టర్లు సంబంధిత రెవెన్యూ కింది స్థాయ సిబ్బందితో పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోం ది. వీరు పథకం ప్రకారమే కొంత పట్టాభూమిని కొనుగోలు చేసి దాని పక్కనే ఉన్న రెండు ఎకరాల సర్కారు భూమిని ఆ పట్టాభూమిలో కలిపేశారు. దీనికి అప్పటి రెవెన్యూసిబ్బంది పూర్తిగా సహకరించినట్లు విమర్శలు వస్తున్నాయి. మొత్తం పట్టాభూమి విస్తీర్ణంలోనే సర్కారుభూమి విస్తీర్ణాన్ని విలీనం చేసి లే అవుట్మ్యాప్ కూడా తయారు చేశారంటున్నారు. ఈ మ్యాఫ్ ఆధారంగా ప్లాట్లను ఆగమేఘాల మీద విక్రయించినట్లు చెబుతున్నారు. అయితే అమాయకులను లక్ష్యంగా చేసుకొని పట్టాభూముల పేరుతో ఈ సర్కారుభూమిని కూడా ప్లాట్లరూపంలో అమ్ము కున్నట్లు పేర్కొంటున్నారు. రెవెన్యూ అధికారుల విచారణలో సర్కారు భూమి విస్తీర్ణం నిర్ధారణ అయితే ఈ భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి రెవెన్యూ యంత్రాంగం
ఇప్పటికే నిర్మల్జిల్లాలో విచ్చలవిడిగా సర్కారు భూముల ఆక్రమణలు జరుగుతున్న వ్యవహారంపై రాష్ట్రహైకోర్టు సైతం సీరియస్గా స్పందించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూముల ఆక్రమణను వెంటనే అడ్డుకోవాలంటూ కూడా యంత్రాంగానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కాపూర్ హైవే సమీపంలోని సర్కారుభూమి ఆక్రమణకు గురైన వ్యవహారాన్ని రెవెన్యూ అధికారులు సీరియస్గా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కా పూర్ గ్రామహద్దులోని ప్రైవేటు, ప్రభుత్వ భూముల వివరాలన్నింటిని అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం రికార్డులను కూడా పరిశీలన జరుపుతున్నారంటున్నాతం ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యాఫ్లను సైతం సేకరించి ఆ మ్యాప్ల ఆధారంగా అక్కాపూర్ భూముల రీ సర్వే జరపాలని కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ముఖ్యంగా రియల్ఎస్టేట్ వెంచర్లు సంబంధించిన భూములన్నింటినీ సర్వేచేసి ఆ భూ ములకు ఆనుకొని ఉన్న సర్కారు భూముల లెక్కలు వెలికితీసే పనిలో అధికారులు నిమగ్నం కాబోతున్నట్లు సమాచారం.
అధికారుల ఆదేశాలు బేఖాతరు
రాష్ట్ర హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులు సర్కారుభూముల ఆక్రమణలపై గత కొద్ది రోజుల నుంచి సీరియస్గానే దృష్టి కేంద్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల నుంచి సర్కారు భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సైతం ఇప్పటికే చాలా మందికి ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ప్రైవేటు పట్టాభూమిల పక్కనే ఉన్న సర్కారు భూములను ఈ రియల్ కబ్జాదారులు లక్ష్యంగా చేసుకుంటుండడం గమనార్హం. అధికారులు సర్వేలు చేసే సమయంలోనూ అలాగే విచారణ జరిపే సమయంలోనూ రియల్లర్టు తమకున్న రాజకీయ పలుకుబడి, పరపతితో పెద్ద ఎత్తున ఒత్తిడులు తెస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రాజకీయ ఒత్తిడుల కారణంగా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడం లేదన్న వాదనలున్నాయి. అయి తే ఈ సారి మాత్రం గతానికి భిన్నంగా సర్కారు భూముల ఆక్రమణలపై ఇక కొరఢా ఝులిపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారంటున్నారు.
ప్రభుత్వ భూములను
ఆక్రమిస్తే కఠినచర్యలు
అక్కాపూర్ శివారులోని హైవే పక్కన ప్రభుత్వ భూమిని ఆక్ర మించినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఆక్రమణదారులపై కఠిన చర్యలుంటాయి. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గబోం. మండలంలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందితే పకడ్బందీగా విచారణ జరుపుతాం.
- సుభాష్చందర్, తహసీల్దార్
Updated Date - 2021-02-04T05:15:43+05:30 IST