ప్రార్థనాలయాల్లో కరోనా నియంత్రణకు కృషి చేయాలి
ABN, First Publish Date - 2021-04-23T05:49:22+05:30
జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, క్రైస్తవ ప్రార్థనాలయాల్లో కరోనా నియంత్రణకు మత పెద్దలు కృషి చేయాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ కోరారు.
కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
నిర్మల్టౌన్, ఏప్రిల్ 22 : జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, క్రైస్తవ ప్రార్థనాలయాల్లో కరోనా నియంత్రణకు మత పెద్దలు కృషి చేయాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ కోరారు. జిల్లాలో కరోనా విజృంభణ కారణంగా కరోనా నియంత్రణపై జిల్లా పాలనాధికారి కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నిబంధనలు పాటించాలన్నారు. ఆలయ ప్రాంగణాలను శానిటైజర్ చేయాలని, భక్తులు మాస్క్లు ధరించాలని, భక్తులు ఆలయాల్లో ఏ నిబంధనలు పాటించాలో తెలిపే బోర్డులను ప్రవేశంద్వారం వద్ద ఏర్పాటు చేయాలని అన్నారు. ఎక్కువ మంది గుమికూడకుండా భౌతికదూరం పాటించాలని తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన వారు తప్సనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు. అన్ని దేవాలయాల్లో, మసీదులలో, చర్చిలలో క్యాంపులు ఏర్పాటు చేసి రోజుకు 200 మంది టీకా వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 30 వరకు ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, మే 1 నుండి వ్యాక్సిన్కు రుసుము చెల్లించవలసి ఉంటుందన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ధర వ్యాక్సిన్ 400ల రూపాయలతో పాటు సర్వీస్ చార్జీలు చెల్లించవలసి ఉంటుందని అన్నారు. ప్రైవేట్లో 600ల రూపాయలతో పాటు సర్వీస్ చార్జీలు ఉంటాయని తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ నెల చివరి నాటికి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆదేశించారు. అందరి సహకారంతో సెకండ్ వేవ్ కరోనాను తరిమి కొట్టాలని కోరారు. వ్యాక్సిన్ వేసుకోవడంలో మ హిళలు అధికసంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా పాలనాధికారులు హేమంత్బోర్కడే పి. రాంబా బు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధన్రాజ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అవినాష్, డీపీఆర్వో తిరుమల, మత పెద్దలు, అన్ని మండలాల పీవోలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-23T05:49:22+05:30 IST