శతకం బాదేద్దామనుకున్నా కానీ..!
ABN, First Publish Date - 2021-07-19T07:04:25+05:30
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శిఖర్ ధవన్..
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శిఖర్ ధవన్ 95 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్తో 86 పరుగులు చేసి చివరివరకు అజేయంగా నిలిచాడు. అయితే తాను సెంచరీ చేయాలనుకున్నానని, అయితే బోర్డుపై ఎక్కువ పరుగులు లేకపోవడంతో అది సాధ్యం కాలేదని ధవన్ చెప్పాడు. అలాగే మ్యాచ్లో అద్భుతంగా ఆడిన జట్టులోని యువ ఆటగాళ్లపై ధవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. కుర్రాళ్లు అదరగొట్టారని ముఖ్యంగా పృథ్వీ, ఇషాన్ ఆడిన తీరు అత్యద్భుతమని ఆకాశానికెత్తేశాడు. వాళ్లిద్దరూ మ్యాచ్ను 15 ఓవర్లలోనే పూర్తి చేశారని అభినందించాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవం బాగా ఉపయోగపడిందని, కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన గబ్బర్.. ‘మా జట్టులో చాలా మంది ఇదివరకే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. వాళ్లెంతో పరిణతి చెందిన ఆటగాళ్లు. ఇలా ఆడటం చాలా ఆనందంగా ఉంది. వికెట్ ఫ్లాట్గా ఉందని తెలుసు. అయితే, మా ముగ్గురు స్పిన్నర్లు పదో ఓవర్ నుంచే శ్రీలంకపై ఒత్తిడి తెచ్చారు. ఇక మేం ఛేదనకు దిగినప్పుడు కూడా నాన్స్ట్రైకర్ ఎండ్లో నుంచి మా ఆటగాళ్ల బ్యాటింగ్ చూడటం గొప్పగా ఉంది. ఐపీఎల్లో ఆడటంతో మంచి అవగాహన సంపాదించుకున్నారు. వాళ్ల ఆత్మవిశ్వాసం కూడా చాలా బాగుంది. పృథ్వీ, ఇషాన్ ఆడిన తీరు అత్యద్భుతం. వాళ్లు 15 ఓవర్లలోనే మ్యాచ్ను పూర్తి చేశారు. నిజానికి నేను సెంచరీ చేయాలనుకున్నా. కానీ, బోర్డుపై ఎక్కువ పరుగులు లేకపోవడంతో సాధ్యం కాలేదు. ఇక చివరి వరకు నాటౌట్గా నిలిస్తే చాలని ఆడాను. అలాగే నిలవగలిగాను’ అని ధావన్ పేర్కొన్నాడు.
Updated Date - 2021-07-19T07:04:25+05:30 IST