టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రికి కరోనా.. ఐపీఎల్ నుంచి ఇంటికి!
ABN, First Publish Date - 2021-04-28T23:36:40+05:30
టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఐపీఎల్ కామెంటేటర్స్ బయోసెక్యూర్ బబుల్ నుంచి బయటకు వెళ్లనున్నాడు.
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఐపీఎల్ కామెంటేటర్స్ బయోసెక్యూర్ బబుల్ నుంచి బయటకు వెళ్లనున్నాడు. తన తండ్రికి కరోనా వైరస్ సంక్రమించడంతో ఆర్పీసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడైన ఆర్పీసింగ్ 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో స్టార్స్పోర్ట్స్తో ఒప్పందం కుదుర్చుకుని హిందీ కామెంట్రీ చెబుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లతోపాటు కామెంటేటర్లు, బ్రాడ్కాస్టర్లు కూడా బయోబబుల్లో ఉండడం తప్పనిసరి.
తండ్రికి నిన్న కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు వెళ్లాలని ఆర్పీసింగ్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం తన అవసరం కుటుంబానికి ఉందని, అందుకే బయోసెక్యూర్ బబుల్ను విడిచిపెడుతున్నట్టు పేర్కొన్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి బయోబబుల్ నుంచి బయటకు వెళ్తే తిరిగి అందులో అడుగుపెట్టే అవకాశం లేదు.
Updated Date - 2021-04-28T23:36:40+05:30 IST