పర్దీప్ అ‘ధర’హో
ABN, First Publish Date - 2021-08-31T09:41:05+05:30
డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్.. పాయింట్లు తీసుకురావడంలోనే కాదు.. వేలంలోనూ అదరహో అనిపించాడు.
ప్రొ కబడ్డీ వేలంలో డుబ్కీ కింగ్కు రూ. 1.65 కోట్లు
అత్యధిక మొత్తంతో యూపీ సొంతం
న్యూఢిల్లీ: డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్.. పాయింట్లు తీసుకురావడంలోనే కాదు.. వేలంలోనూ అదరహో అనిపించాడు. సోమవారం జరిగిన ప్రొ కబడ్డీ సీజన్-8 వేలంలో.. లీగ్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.65 కోట్ల ధర పలికిన ఆటగాడిగా నర్వాల్ రికార్డు సృష్టించాడు. తొలిసారి వేలానికి వచ్చిన రైడర్ పర్దీప్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీపడినా.. చివరకు యూపీ యోధ జట్టు అతడి కనీస ధర రూ. 30 లక్షలకు ఐదు రెట్లుపైగా వెచ్చించి మరీ దక్కించుకుంది. ఆదివారం మొదలైన ఈ వేలంలో 161 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. మంగళవారం వేలం ముగియనుంది. కాగా, కేటగిరీ-ఎ ఆటగాళ్ల వేలంలో రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ను రూ. 1.30 కోట్లకు తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకుంది. గత సీజన్లో రూ. కోటికిపైగా పలికిన రాహుల్ చౌధరిపై ఈసారి ఫ్రాంచైజీలు ఆసక్తి ప్రదర్శించలేదు. పుణెరి పల్టన్ రూ. 40 లక్షలకే రాహుల్ను సొంతం చేసుకుంది. చంద్రన్ రంజిత్ను రూ. 80 లక్షలకు, మంజీత్ను రూ. 92 లక్షలకు తలైవాస్, శ్రీకాంత్ జాదవ్ను యూపీ రూ. 72 లక్షలకు, రోహిత్ కుమార్ను రూ. 36 లక్షలకు టైటాన్స్ దక్కించుకున్నాయి.
దీపక్ మళ్లీ జైపూర్కే:
ఆల్రౌండర్ దీపక్ నివాస్ హుడాను రూ. 55 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ సొంతం చేసుకోగా.. రోహిత్ గులియాను హరియాణా స్టీలర్స్ రూ. 83 లక్షలకు కొనుగోలు చేసింది. కేటగిరీ-ఎ డిఫెండర్లలో సుర్జీత్ సింగ్ (రూ. 75 లక్షలు)ను తమిళ తలైవాస్.. రవీందర్ పహల్ (రూ. 74 లక్షలు)ను గుజరాత్, విశాల్ భరద్వాజ్ (రూ. 60 లక్షలు)ను పుణెరి పల్టన్, సందీప్ కుమార్ ధుల్ (రూ. 50 లక్షలు)ను జైపూర్ పింక్ పాంథర్స్ సొంతం చేసుకున్నాయి.
Updated Date - 2021-08-31T09:41:05+05:30 IST