Olympics.. భారత క్రీడాకారుల తాజా అప్డేట్స్ ఇవీ..!
ABN, First Publish Date - 2021-07-31T21:41:53+05:30
భారత తరఫున శనివారం రంగంలోకి దిగిన పలువురు క్రీడాకారులు తన అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్ పతకం ఆశలను సజీవంగా ఉంచారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారతీయుల దృష్టంతా పీవీ సింధూ పైనే..! ఒలింపిక్స్లో అద్భుత ఆటతీరుతో దూసుకెళుతున్న సింధూ.. చైనా క్రీడాకారిణిపై విజయం సాధించాలని యావత్ దేశం కోరుకుంటోంది. మరోవైపు..భారత్ తరఫున శనివారం రంగంలోకి దిగిన పలువురు క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్ పతకం ఆశలను సజీవంగా ఉంచారు. డిస్కస్ ఈవెంట్లో కమల్ప్రీత్ సింగ్ ఫైనల్స్కు చేరుకుంది. మరో అథ్లెట్ సీమా పునియా నిరాశపరిచినా.. కమల్ప్రీత్ సింగ్ కచ్చితంగా పతకం తెస్తుందనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇక గ్రూప్-ఏ మ్యాచ్లో మహిళల హాకీ జట్టు దక్షిణాఫ్రికా టీంను 4-3తో ఓడించింది. తద్వారా ఆరు పాయింట్ల సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. నేడు జరగబోయే మరో మ్యాచ్తో ఈ జట్టు సెమీ ఫైనల్స్లోకి అడుగుపెడుతుందో లేదో తేలిపోతుంది. బాక్సింగ్ ఫ్లైవెయిట్ విభాగంలో రౌండ్-16లో అమిత్ పంఘల్ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఆర్చరీ విభాగంలో అతాను దాసు అభిమానులను నిరాశపరుస్తూ రౌండ్-16 నుంచి వెనుదిరిగాడు. షూటింగ్లోనూ భారత్కు చేదు అనుభవమే మిగిలింది. మహిళల 50 మీటర్ రైఫిల్ విభాగంలో పోటీపడ్డ అంజుమ్ మౌద్గిల్, తేజస్వినీ సావత్ ఫైనల్స్కు అర్హత సాధించలేక వెనుదిరిగారు.
Updated Date - 2021-07-31T21:41:53+05:30 IST