విజృంభిస్తున్న బౌలర్లు.. ఓటమి దిశగా భారత్
ABN, First Publish Date - 2021-08-28T22:16:13+05:30
నిన్న పటిష్టంగా కనిపించిన టీమిండియా నేడు బెంబేలెత్తుతోంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ
లీడ్స్: నిన్న పటిష్టంగా కనిపించిన టీమిండియా నేడు బెంబేలెత్తుతోంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయనిస్తోంది. పుజారా అవుట్తో ప్రారంభమైన వికెట్ల పతనం కొనసాగుతోంది. 215/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు అదే స్కోరు వద్ద చతేశ్వర్ పుజారా (91) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కాసేపటికే అర్ధ సెంచరీ (55) పూర్తి చేసుకున్న కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. వీరిద్దరినీ రాబిన్సన్ వెనక్కి పంపాడు. అప్పటికి టీమిండియా స్కోరు 237 పరుగులు. ఆ తర్వాత రెండు పరుగులకే అజింక్య రహానే (10) అవుట్ కాగా, అదే స్కోరు వద్ద రిషభ్ పంత్ (1) పెవిలియన్ చేరాడు.
ఈ సిరీస్లో పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్న రహానే ఈ మ్యాచ్లోనూ అదే చెత్త ఫామ్ కొనసాగించాడు. మరోవైపు పంత్ కూడా బ్యాట్కు పనిచెప్పలేకపోతున్నాడు. 239 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఇండియా ఓటమి దిశగా పయనిస్తోంది.
నేడు కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు రాబిన్సన్కే దక్కడం గమనార్హం. మొత్తంగా రాబిన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి ఇంగ్లండ్ కంటే 107 పరుగుల దూరంలో ఉంది. జడేజా, షమీ క్రీజులో ఉన్నాడు.
Updated Date - 2021-08-28T22:16:13+05:30 IST