తల్లి అంత్యక్రియలకు కుమారుని వేడుకోలు.. ముఖం చాటేసిన ఇరుగుపొరుగు!
ABN, First Publish Date - 2021-05-03T17:28:33+05:30
కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మింగేస్తోంది.
జైత్పూర్: కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మింగేస్తోంది. కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇక కరోనా మృతుల విషయం చెప్పనలవికాదు. ఢిల్లీలోని జైత్పూర్నకు చెందిన ఒక యువకునికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ యువకుని తల్లి మృతి చెందగా, ఆసుపత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని అంబులెన్లో తీసుకువచ్చి, అతని ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను చూడగానే అతని ఇంటి చుట్టుపక్కలవారు కనీస సాయం చేయకపోగా, వారి ఇంటి తలుపులు వేసుకున్నారు.
అతని బంధువులు కూడా ఆదుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ యువకుడు సాయం కోసం పోలీసులను అర్ధించాడు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకునికి సాయం అందిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఆ యువకుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి ఆర్పీ మీణా మాట్లాడుతూ ఏప్రిల్ 30న ఒక యువకుడు తమకు పోన్ చేసి, అంత్యక్రయల కోసం సాయం అర్థించాడన్నారు. అనారోగ్యంతో అతని తల్లి కృష్ణాదేవి మృతి చెందిందని తెలిపాడన్నారు. తాము వెళ్లి అతనికి సాయం అందించామన్నారు.
Updated Date - 2021-05-03T17:28:33+05:30 IST