తమిళనాడులో ఈ టైం తెల్లచొక్కాలది మరి!
ABN, First Publish Date - 2021-03-05T17:57:17+05:30
శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయ నేతలు ధరించే తెల్లచొక్కాలకు గిరాకీ పెరిగింది.
చెన్నై/పెరంబూర్ : శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయ నేతలు ధరించే తెల్లచొక్కాలకు గిరాకీ పెరిగింది. దీంతో సహజంగానే వాటి ధరలు పెరిగాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారం, కూటమి ఏర్పాటు, అభ్యర్థుల ఎంపికలో ముమ్మరంగా ఉన్నాయి. అదే సమయంలో రాజకీయ నేతలకు తెల్ల చొక్కా ధరిస్తే రాజసం ఉట్టిపడుతుందని నమ్మకం. నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు, కొందరు కార్యకర్తలు కూడా తెల్ల చొక్కాలు ధరించి ప్రచారంలో పాల్గొంటుంటారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అన్ని రెడీమేడ్ దుస్తుల దుకాణాల్లో తెల్ల చొక్కాలను భారీగా దిగుమతి చేసుకోగా, వాటి విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా రూ.250 నుంచి రూ.300 ధర పలికే ఒక ఖద్దరుచొక్కా ప్రస్తుతం రూ.400 నుంచి రూ.450 వరకు విక్రయమవుతోంది. పలు పార్టీల నేతలు 500 నుంచి 1,000 చొక్కొల వరకు బల్క్ ఆర్డర్లు ఇచ్చినట్టు వ్యాపారులు పేర్కొంటు న్నారు.
Updated Date - 2021-03-05T17:57:17+05:30 IST