భార్య కోసం ఎర్రచీర దొంగిలించిన భర్త.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు
ABN, First Publish Date - 2021-07-05T01:40:58+05:30
భార్య కోసం ఎర్రచీర దొంగిలించిన భర్త.. జాతీయ భద్రతా చట్టం కింద కేసు
భోపాల్: ఓ దుకాణంలో చూసిన ఎర్ర చీరపై మనసు పారేసుకున్న పాత నేరస్తుడు ఒకడు దానిని దొంగిలించి తెచ్చి ఇచ్చి మరీ భార్య మనసు దోచుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అతడు కష్టాల్లో పడ్డాడు. చీరను దొంగిలించిన అతడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిందీ ఘటన. పాత నేరస్తుడైన విక్కీపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల స్థానిక ఫ్రీగంజ్ చౌపట్టీలోని ఓ వస్త్ర దుకాణంలో అతడి కంటబడిన ఓ ఎర్ర చీర అతడి మనసును కట్టిపడేసింది. ఆ చీర తనకే అంతగా నచ్చేస్తే తన భార్య ఇంకెంత మురిసిపోతుందో అనుకున్నాడు.
ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా చీరల దుకాణంలోకి వెళ్లి కత్తి చూపించి హంగామా చేశాడు. అడ్డొచ్చిన వారిని బెదిరించాడు. ఆ సమయంలో షోరూములోని గల్లాపెట్టె కళకళలాడుతున్నా దాని జోలికి పోకుండా తనకు నచ్చిన ఎర్రచీరను తీసుకెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. షోరూం యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని విక్కీగా తేల్చారు.
అతడు పాత నేరస్తుడని, ఇప్పటికే అతడిపై 16 కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇక తప్పించుకోవడానికి ఎంతమాత్రమూ వీలు లేకుండా విక్కీపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. విక్కీని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అతడు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఈ దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించాడు. కాగా, చీర దొంగతనం చేస్తే జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.
Updated Date - 2021-07-05T01:40:58+05:30 IST