BMW కారుకు ఓనర్లయిన చాయ్వాలా, లాండ్రీవాలా!
ABN, First Publish Date - 2021-11-07T01:40:51+05:30
బీఎండబ్ల్యూ కారు కొనాలంటే బాగా సంపన్నులై ఉండాలి. లేదంటే పారిశ్రామికవేత్త అయినా అయి ఉండాలి. కానీ
అహ్మదాబాద్: బీఎండబ్ల్యూ కారు కొనాలంటే బాగా సంపన్నులై ఉండాలి. లేదంటే పారిశ్రామికవేత్త అయినా అయి ఉండాలి. కానీ ఓ టీ అమ్ముకునే వ్యక్తి, దుస్తులు ఇస్త్రీ చేసే వ్యక్తి కలిసి బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశారు. అంతమాత్రాన వారేమీ ధనవంతులూ కాదు, పారిశ్రామికవేత్తలు అసలే కాదు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వీరిద్దరినీ అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు వారి చెప్పింది విని విస్తుపోయారు. తేరుకోవడానికి వారికి చాలా సమయం పట్టింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిందీ ఘటన.
నిందితుల్లో ఒకడైన యూసుఫ్ గంచి (36) టీ అమ్ముతూ జీవిస్తుంటాడు. మరో నిందితుడు అరీఫ్ గంచి (27) దుస్తులు ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల వీరిద్దరూ కలిసి బీఎండబ్ల్యూ కారులో తిరుగుతుండడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. నిజంగా అంత డబ్బు సంపాదించారేమోనని అనుకున్నారు తప్పితే ఎవరూ నోరు మెదపలేదు. కానీ, అనుమానం మాత్రం ఏమూలో పట్టి పీడించేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వీరి బండారం బయటపడడంతో అందరూ షాకయ్యారు.
నిందితులిద్దరూ పారిశ్రామిక యూనిట్లు ఉన్న యజమానులను కలుస్తారు. అధికారులను కలిసి ఫిర్యాదు చేసి కంపెనీ లైసెన్స్ రద్దు చేయిస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. వారు లొంగకుంటే అప్పుడు ప్లాన్-బిని అమలు చేస్తారు. డబ్బులు ఇవ్వకుంటే సూసైడ్ నోట్లో మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు.
ఇలాంటి ట్రిక్నే ఉపయోగించి సర్కేజ్ ప్రాంతానికి జావెద్ గలేరియా (30) నుంచి రూ. 31.5 లక్షలు దోచుకున్నారు. మూడేళ్లుగా వీరి బ్లాక్మెయిలింగ్ను భరిస్తున్న జావెద్ ఇక తట్టుకోలేకపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారి బారినపడి 8 మంది డబ్బులు సమర్పించుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
Updated Date - 2021-11-07T01:40:51+05:30 IST