హోం క్వారంటైన్ బాధితులను ఆదుకుంటున్న యువకుడు
ABN, First Publish Date - 2021-04-29T13:20:24+05:30
సెకెండ్ వేవ్లో కరోనా మరింత భీతావహంగా మారింది.
న్యూఢిల్లీ: సెకెండ్ వేవ్లో కరోనా మరింత భీతావహంగా మారింది. బాధితులకు ఆసుపత్రులలో బెడ్లు కరువయ్యాయి. ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని బోరీవలీకి చెందిన రాజీవ్ సింఘల్ తన సేవాగుణాన్ని చాటుతున్నారు. ప్రతీరోజూ ఇంటిలో తయారుచేసిన ఆహారాన్ని 200 మందికి మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో అందిస్తున్నారు. వస్త్ర వ్యాపారి అయిన రాజీవ్ సింఘల్... కరోనాతో బాధపడుతూ హోం క్వారంటైన్ లో ఉన్నవారి ఆకలిని తీరుస్తున్నారు.
ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ గత ఏడాది తనకు కరోనా పాజిటివ్ వచ్చినపుడు, హోమ్ క్వారంటైన్లో ఉన్నానని, మంచి భోజనం కోసం ఎదురు చూసేవాడినన్నారు. అయితే హోమ్ క్వారంటైన్లో ఉన్న అందరికీ మంచి భోజనం దొరకడం కష్టమని అన్నారు. దీనిని గుర్తించిన మీదటే తాను బాధితులకు ఉచితంగా ఆహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇందుకోసం 200 మంది హోమ్ క్వారంటైన్ బాధితులకు ఆహారం సిద్ధంచేస్తూ, వారికి అందిస్తున్నానన్నారు. రాజీవ్ దగ్గర పనిచేసే ఆశా భర్తియా మాట్లాడుతూ తాను అన్నం, పప్పు, రెండు రకాల కూరలు, అప్పడాలు, పచ్చళ్లు మొదలైనవి సిద్ధం చేస్తానన్నారు. వాటిని ప్యాక్ చేసి బాధితుల ఇంటికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.
Updated Date - 2021-04-29T13:20:24+05:30 IST