అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని వైద్యుడి నిర్ధారణ! మరుసటి రోజు పోస్ట్మార్టం చేసే ముందు అనూహ్యంగా..
ABN, First Publish Date - 2021-11-24T03:15:21+05:30
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడని నిర్ధారించిన వైద్యులు అతడిని మార్చరీకి తరలిస్తే..మరుసటి రోజు అతడు బతికే ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడని నిర్ధారించిన వైద్యులు అతడిని మార్చురీకి తరలిస్తే..మరుసటి రోజు అతడు బతికే ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకేశ్ కుమార్ అనే వ్యక్తి మోటర్ సైకిల్ యాక్సిడెంట్కు గురవడంతో స్థానికులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు..అతడు మరణించాడని నిర్ధారించి మార్చురీకి తరలించారు.
మరుసటి రోజు పోస్ట్మార్టం చేసేందుకు ముందు అతడు బతికే ఉన్నట్టు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అందరూ షాకైపోయారు. అతడికి ఊపిరి ఆడుతున్నట్టు గుర్తించిన కుటుంబసభ్యులకు నోటమాటరాలేదు. శ్రీకేశ్ చనిపోయాడంటూ నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులపై వారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అయితే..ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తమ తప్పేమీ లేదని స్పష్టం చేసింది. వైద్యుడు శ్రీకేశ్ను పరీక్షించిన సమయంలో అతడు బతికున్నట్టు ఎటువంటి లక్షణాలూ కనిపించలేదని స్పష్టం చేశారు. దీన్ని అత్యంత అరుదైన కేసుల్లో ఒకటిగా వారు వ్యాఖ్యానించారు. అయితే..శ్రీకేశ్ ప్రస్తుతం కోమాలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
Updated Date - 2021-11-24T03:15:21+05:30 IST