గర్ల్ఫ్రెండ్ను కలవాలంటే ఏ స్టిక్కర్ వాడాలి? పోలీసులకు నెటిజన్ ప్రశ్న! ఆ తరువాత..
ABN, First Publish Date - 2021-04-22T21:24:40+05:30
నెటిజన్ తుంటరి ప్రశ్న..వైరల్ అవుతున్న పోలీసుల సమాధానం
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుడడంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలకు తెరలేపింది. వాహనాల రాకపోకలను కట్టడి చేసే క్రమంలో ముంబై పోలీసులు కలర్ కోడెడ్ స్టిక్కర్ల వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బంది, తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సిన వారు తమ సౌలభ్యం కోసం ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ స్టిక్కర్లను నిబంధనలకు అనుగుణంగా వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్టిక్కర్ల వల్ల టోల్ ప్లాజాలు, చెక్ పాయింట్ల వద్ద వాహనదారులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ముందుకు సాగిపోవచ్చు. ఇవి టోల్ ప్లాజాల వద్ద అందుబాటులో ఉంటాయి. వాహనదారులు వీటిని తమ ఇళ్లలోనూ తయారు చేసుకోవచ్చు. వీటిని దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన శిక్షలు విధించాల్సి వస్తుందని పోలీసులు ముందే హెచ్చరించారు.
అయితే.. దీనిపై నెటిజన్ ఒకరు ట్విటర్ వేదికగా తుంటరి ప్రశ్న వేశారు. ‘‘నా గర్ల్ఫ్రెండ్ను కలవడానికి వెళదామనుకుంటున్నా! మరి వెహికిల్కు ఏ స్టిక్కర్ వాడాలి. ఆమెను చాలా మిస్సవుతున్నా’’ అంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనికి ముంబై పోలీసులు మాత్రం చాలా హుందాగా జావాబిచ్చారు. ‘‘గర్ల్ఫ్రెండ్ను కలవడం మీకు ఎంతో ముఖ్యమని మేం అర్థం చేసుకున్నాం. కానీ..ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది అత్యవసరమేమీ కాదు. అయితే.. దూరం పెరిగేగొద్దీ మనసులు మరింత దగ్గరవుతాయి.. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆరోగ్యకరం కూడా..! మీరిద్దరూ జీవితాంతం కలిసుండాలని మేం కోరుకుంటున్నాం. గుర్తుంచుకోండి.. ఇది జీవితంలో ఓ దశ మాత్రమే..’’ అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల ట్వీట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేల కొద్దీ లైకులు, రీట్వీట్లూ వచ్చిపడుతున్నాయి.
Updated Date - 2021-04-22T21:24:40+05:30 IST