ఆమెకు చాలామంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారన్న లాయర్.. మందలించిన హైకోర్టు
ABN, First Publish Date - 2021-04-09T03:26:58+05:30
గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు చాలామంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారన్న లాయర్ను
ముంబై: గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు చాలామంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారన్న లాయర్ను బాంబే హైకోర్టు మందలించింది. అదెక్కడి వాదన అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. లా పాయింట్పై మాట్లాడాలని కోరింది. గృహ హింస చట్టం కింద తన తల్లి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి దిగువ కోర్టు తనపై ప్రారంభించిన విచారణను రద్దు చేయాలని కోరుతూ నగరానికి చెందిన ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎస్ఎస్ షిండే, మనీశ్ పిటాలేతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది.
మహిళ తరపు న్యాయవాది కెన్నీ ఠక్కర్ మాట్లాడుతూ.. ఉన్నత విద్య అభ్యసించేందుకు పిటిషనర్ ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఫిర్యాదును కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ తల్లి తరపు న్యాయవాది ఆయన అభ్యర్థనను వ్యతిరేకించారు. పిటిషర్కు చాలామంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారని కోర్టుకు తెలిపారు.
వెంటనే కల్పించుకున్న జస్టిస్ పాటిల్ ఆయనను మందలించారు. ఇలాంటి వాదనలు ఆపేయాలని కోరారు. ‘‘ఇదెక్కడి వాదన? ఇది (పిటిషనర్) జీవితానికి సంబంధించినది. ఆమెకు చాలామంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారనడమేంటి. లా పాయింట్పై మాట్లాడండి’’ అని మందలించారు. పిటిషనర్ చాలా దూరం వెళ్తున్నారని, కాబట్టి తల్లి సంతోషంగా ఉండాలని కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును ఈ నెల 19న వెలువరించనున్నట్టు ధర్మాసనం పేర్కొంది.
Updated Date - 2021-04-09T03:26:58+05:30 IST