ఆన్లైన్ ఇన్వ్స్ట్మెంట్ పేరుతో కోట్ల దోపిడీ.. 21 మందికి కుచ్చుటోపీ
ABN, First Publish Date - 2021-10-13T13:15:08+05:30
ఆన్లైన్ ఇన్వ్స్ట్మెంట్ పేరుతో 21 మందికి ఒక వ్యక్తి 2 కోట్ల రూపాయల వరకు మోసం చేసిన ఘటన పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరిగింది...
ఆన్లైన్ ఇన్వ్స్ట్మెంట్ పేరుతో 21 మందికి ఒక వ్యక్తి 2 కోట్ల రూపాయల వరకు మోసం చేసిన ఘటన పంజాబ్ రాజధాని చండీగఢ్లో జరిగింది. చండీగఢ్లో భపేంద్ర సింగ్ అనే వ్యక్తి తాను ఆన్లైన్ ఇన్వ్స్ట్మెంట్ పేరు చెప్పి ఒక వ్యక్తి మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేయగా ఇది చిన్న మోసం కాదు పెద్ద స్కామ్ అని తేలింది.
పోలీసుల కథనం ప్రకారం చండీగఢ్లోని ఒక సివిల్ కోర్టులో టైపిస్ట్ ఉద్యోగం చేసుకునే ముకేశ్ బాబు(48) అనే వ్యక్తిపై చీటింట్ కేసు నమోదైంది. ముకేశ్ బాబు తనకు తెలిసిన వ్యక్తుల వద్ద ఆన్లైన్ ఇన్వ్స్ట్మెంట్ చేయండి రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మించాడు. ఇందుకోసం ఈపీసీ వాలెట్ అనే కంపెనీ వెబ్సైట్ పెట్టాడు. ఆ కంపెనీలో పెట్టుబడులు పెడితే 200 రోజులలో మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుందని నమ్మబలికాడు.
ఇంకా ఈ మోసాలు చేయడానికి ఏజెంట్లను నియమించాడు. ఆ ఏజెంట్లు అమాయకులని ఉచ్చులోకి లాగారు. అసలు పెట్టుబడి రెట్టింపు ఎలా అవుతుందని అడిగితే. ఈ వాలెట్ చాలా పెద్ద కంపెనీ.. ఈ కంపెనీ విదేశీ కంపెనీలలో పెట్టుబడులు పెడుతుందని, పైగా బిఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ మార్కెట్లలో ఉన్న పెద్ద కంపెనీలతో వ్యాపారం చేస్తుందని నమ్మించారు. తీరా 200 రోజుల తరువాత డబ్బు తిరిగి ఇచ్చే సమయం వచ్చే సరికి ఆఫీస్ బోర్డు ఎత్తేశాడు. దీంతో పెట్టుబడి పెట్టినవారు ఖంగుతిని పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు ముకేశ్ బాబు పంజాబ్లో కూడా ఇటువంటి మోసాలు చేశాడని తెలిసింది.
పోలీసులు ముకేశ్ బాబుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Updated Date - 2021-10-13T13:15:08+05:30 IST