అమెరికాలో రోడ్డు ప్రమాదం తెలంగాణ యువకుడి మృతి
ABN, First Publish Date - 2021-11-29T15:03:18+05:30
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కారులో ఉన్న నల్లగొండకు చెందిన అతడి స్నేహితురాలి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కారులో వెళ్తుండగా ఢీకొట్టిన టిప్పర్
మరో రెండు వారాల్లోనే స్వదేశానికి వస్తున్నానని తల్లిదండ్రులకు సమాచారం
ఇంతలోనే తిరిగిరాని లోకాలకు
సూర్యాపేట టౌన్, నవంబరు 28: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కారులో ఉన్న నల్లగొండకు చెందిన అతడి స్నేహితురాలి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెంది న నరేంద్రుని లింగమూర్తి-సుధారాణి దంపతుల కుమారుడు చిరుసాయి (22) విజయవాడలో బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి 11 నెలల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఓహియోలో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నారు. డిసెంబరు 15న భారత్కు బయలుదేరేందుకు చిరుసాయి విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో నల్లగొండకు చెందిన స్నేహితురాలు లావణ్యతో కలిసి షాపింగ్ చేశారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటల సమయంలో కారులో తిరిగి వెళ్తుండగా భారీగా మంచు కురుస్తోంది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న చిరుసాయి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన లావణ్య కోమాలోకి వెళ్లారు. చిరుసాయి సోదరి మేఘన ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రమాదం విషయాన్ని తెలిపారు.
దీంతో వారు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. 11 నెలల క్రితమే అమెరికా వెళ్లిన తమ కుమారుడు 17 రోజుల్లో ఇంటికి వస్తాడనగా, మృతిచెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. చిరుసాయి మృతి విషయం తెలియడంతో లింగమూర్తి దంపతులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావుతో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. గత రాత్రే తమ కుమారుడు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాడని, డిసెంబరు 15వ తేదీన భారత్కు తిరిగి వస్తున్నట్లు చెప్పాడని తల్లిదండ్రులు లింగమూర్తి, సుధారాణి విలపించారు. మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభు త్వం చొరవ చూపాలని కోరారు. కాగా వారి కుమార్తె మేఘనకు వివాహమై అమెరికాలో స్థిరపడ్డారు.
Updated Date - 2021-11-29T15:03:18+05:30 IST