యూఎస్లోని మూడు రాష్ట్రాల్లో కాల్పులు.. ఇద్దరు మృతి, 30 మందికి గాయాలు
ABN, First Publish Date - 2021-06-13T18:25:22+05:30
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మూడు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మూడు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, మరో 30 మంది వరకు గాయపడ్డారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున మధ్యలో టెక్సాస్ రాజధాని అస్టిన్తో పాటు చికాగో, జార్జీయాలోని సవన్నాలో ఈ మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున అస్టిన్లో జరిగిన కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక చికాగోలో చోటు చేసుకున్న కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా, 9 మంది గాయపడ్డారు. ఇద్దరు దుండగులు పార్టీలో విచక్షణరహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. అలాగే జార్జీయాలోని సవన్నాలో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సవన్నా పోలీస్ చీఫ్ రాయ్ మింటర్ జూనియర్ తెలిపారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం.
Updated Date - 2021-06-13T18:25:22+05:30 IST