NRI global meet: ప్రవాస భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక భేటీ
ABN, First Publish Date - 2021-11-13T18:59:06+05:30
ప్రవాస భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా ఇండో- అరబ్ కాన్ఫెడరేషన్ కౌన్సిల్ (ఐఏసీసీ) డిసెంబర్ 4వ తేదీన కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశం కానుంది.
ఎన్నారై డెస్క్: ప్రవాస భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా ఇండో- అరబ్ కాన్ఫెడరేషన్ కౌన్సిల్ (ఐఏసీసీ) డిసెంబర్ 4వ తేదీన కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశం కానుంది. 'ఎన్నారై గ్లోబల్ మీట్' పేరుతో ఈ సమావేశం జరుగనుంది. కేంద్రమంత్రి రామ్థాస్ అథవాలే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ప్రారంభోపన్యాసం చేయనున్నారు. వివిధ రాష్ట్రాల మంత్రులు, దౌత్యవేత్తలు, విదేశాల్లో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 1980లో కేరళలోని కోజికోడ్ కేంద్రంగా ఏర్పాటైన ఐఏసీసీ అసోసియేషన్.. 2014లో ఛారిటబుల్ ట్రస్ట్గా మారింది. ఈ అసోసియేషన్కు భారత్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు యూఎస్, యూకే, అరబ్ దేశాల్లో శాఖలున్నాయి.
కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి అట్టక్కోయ పల్లిక్కండి డిసెంబర్ 4వ తేదీన బెంగళూరులో జరుగనున్న 'ఎన్నారై గ్లోబల్ మీట్' వివరాలను తాజాగా వెల్లడించారు. "కరోనా ప్రభావంతో ఐఏసీసీ అసోసియేషన్ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే ఎట్టకేలకు వచ్చే నెలలో ఎన్నారై మీట్ జరగనుంది. వరల్డ్వైడ్గా ఉన్న ప్రవాస భారతీయులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. స్వదేశానికి తిరిగొచ్చిన ఎన్నారైలకు గృహనిర్మాణాలు, పునరావాసం కల్పించడంపై కార్యాచరణ ప్రకటిస్తాము. అలాగే భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తాము. దీంతో పాటు వివిధ రంగాల్లో సృజనాత్మకతను చాటుకుంటోన్న ఎన్నారైలను ఘనంగా సన్మానించడం జరుగుతుంది" అని పల్లిక్కండి చెప్పారు.
Updated Date - 2021-11-13T18:59:06+05:30 IST