భారత్లో కరోనా సంక్షోభానికి.. తప్పుడు లెక్కే కారణం: ఆంథోనీ ఫౌసీ
ABN, First Publish Date - 2021-05-12T16:00:32+05:30
మహమ్మారి కరోనావైరస్ అంతం చేసే విషయంలో భారత్ తప్పుడు లెక్కలు వేసిందని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు.
వాషింగ్టన్: మహమ్మారి కరోనావైరస్ అంతం చేసే విషయంలో భారత్ తప్పుడు లెక్కలు వేసిందని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. ప్రస్తుతం భారత్లో నెలకొన్న కరోనా సంక్షోభానికి కారణం కూడా అదేనని ఫౌసీ పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనుక పరిస్థితిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదని భారత్ అనుభవం నుంచి నేర్చుకోవాలని అన్నారు.
"కరోనాను అంతమొందించే విషయంలో భారత్ తప్పుడు లెక్కలే కొంపముంచాయి. వైరస్ను కట్టడి చేశామనే తొందరపాటులో సాధారణ జీవనానికి వెళ్లిపోయింది. మరోవైపు వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. దాంతో ఇప్పుడు ఒక్కసారిగా మహమ్మారి పంజా విసిరింది. ప్రస్తుతం భారత్లో సంక్షోభానికి అదే కారణం. పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదనేది భారత్ అనుభవం చెబుతోంది. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వైరస్ ఉన్నా అది అగ్రరాజ్యానికి ముప్పు తెస్తుంది." అని ఫౌచీ చెప్పుకొచ్చారు. ఇక భారత్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఒక్కసారిగా మహమ్మారి విరుచుకుపడటంతో చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్, ప్రాణవాయువు కొరత, ఔషధాలు దొరకని దయనీయ పరిస్థితి దాపురించిందన్నారు.
Updated Date - 2021-05-12T16:00:32+05:30 IST