ఆ విషయంలో హెచ్-1బీ వీసాదారులకు మద్దతు తెలిపిన గూగుల్!
ABN, First Publish Date - 2021-05-15T21:52:51+05:30
అగ్రరాజ్యం అమెరికాలోని హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు దేశంలో పని చేసుకునే అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాలు అందించే అంశానికి సాంకేతిక దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా మద్దతు తెలిపింది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు దేశంలో పని చేసుకునే అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాలు అందించే అంశానికి సాంకేతిక దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా మద్దతు తెలిపింది. దీని ద్వారా ఆవిష్కరణలు పెరగడంతో ఉద్యోగ ఉత్పాదకత జరుగుతుందని పేర్కొంది. దాంతో ఆటోమెటిక్గా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఇక ఈ విధానం వల్ల ఎక్కువ లాభపడేది అగ్రరాజ్యంలో అధికంగా ఉన్న భారతీయ ఐటీ నిపుణులే అన్న విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా తీసుకొచ్చిన హెచ్-4 ఈఏడీ(ఎంప్లాయిమెంట్ అథారైజేషన్ డాక్యుమెంట్) కార్యక్రమానికి ఇప్పటికే అమెరికాలోని 30 పెద్ద ఐటీ దిగ్గజ సంస్థలు మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో గూగుల్ చేరింది. ఇక H-1B వీసాదారుల కుటుంబ సభ్యులకు (జీవిత భాగస్వామి, 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు) అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) H-4 వీసాలు జారీ చేస్తుంది. హెచ్-4 ఈఏడీ కార్యక్రమం ద్వారా ఈ హెచ్-4 వీసాదారులకు అమెరికాలో పనిచేసుకునే అధికారం లభిస్తుంది.
"అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతు తెలుపుతున్నందుకు గర్వ పడుతున్నాం. హెచ్-4 ఈఏడీ కార్యక్రమానికి ఇతర 30 సంస్థలతో పాటు మేమూ మద్దతు ఇస్తున్నాం. దీని ద్వారా ఆవిష్కరణలు పెరుగుతాయి. ఉద్యోగ సృష్టి జరుగుతుంది. దాంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అధిక నైపుణ్యం కలిగిన కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది." అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.
ఈ మేరకు హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీతత్వం తగ్గుతోందని అక్కడి న్యాయస్థానంలో దాఖలైన కేసులో గూగుల్ శుక్రవారం సేవ్ జాబ్స్ యూఎస్ఏ వర్సెస్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేరిట మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. ఈ 30 సంస్థల్లో అడోబ్, అమెజాన్, ఆపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విట్టర్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ దిగ్గజ ఐటీ సంస్థలు అధిక నైపుణ్యం గల వలసదారుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను తాము కోరుకుంటున్నామని పేర్కొన్నాయి. కాగా, హెచ్-4 ఈఏడీ కార్యక్రమం ద్వారా సుమారు 90 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని గూగుల్ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలు కేథరీన్ లకావెరా వెల్లడించారు. ఇందులో 90శాతానికిపైగా మహిళలే ఉన్నారని ఆమె తెలియజేశారు.
Updated Date - 2021-05-15T21:52:51+05:30 IST