భారత ప్రయాణికులకు దుబాయ్ తీపి కబురు!
ABN, First Publish Date - 2021-06-20T14:32:16+05:30
భారత్ సహా మూడు దేశాలకు చెందిన ప్రవాసుల ఎంట్రీపై దుబాయ్ తాజాగా కీలక ప్రకటన చేసింది.
భారత్ సహా మూడు దేశాల ప్రయాణికుల ఎంట్రీకి దుబాయ్ గ్రీన్ సిగ్నల్
దుబాయ్: భారత్ సహా మూడు దేశాలకు చెందిన ప్రయాణికుల ఎంట్రీపై దుబాయ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. యూఏఈ ఆమోదించిన కరోనా వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకున్న ఈ మూడు దేశాల ప్రయాణికులు దుబాయ్ వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. భారత్తో పాటు దక్షిణాఫ్రికా, నైజీరియాకు చెందిన ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లైతే దుబాయ్ రావొచ్చని షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలోని క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. జూన్ 23 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని పేర్కొంది. భారత ప్రయాణికులు వాలిడ్ రెసిడెన్సీ వీసా కలిగి ఉండి, యూఏఈ ఆమోదించిన కరోనా టీకాలను రెండు డోసులు తీసుకుని ఉన్నారో వారు దుబాయ్ వెళ్లేందుకు అర్హులు. అలాగే జర్నీకి నాలుగు గంటల ముందు రాపిడ్ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.
దుబాయ్ చేరుకున్న తర్వాత మరోసారి పీసీఆర్ టెస్టు తప్పనిసరి. ఈ పీసీఆర్ పరీక్ష ఫలితం వచ్చే వరకు(సుమారు 24 గంటలు పడుతుందని అంచనా) ప్రయాణికులు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలి. అంతేగాక ప్రయాణికులందరూ జర్నీకి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా కేవలం క్యూఆర్ కోడెడ్ నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికేట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల పౌరులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని సుప్రీం కమిటీ వెల్లడించింది. ఇక యూఏఈ ప్రభుత్వం నాలుగు వ్యాక్సిన్లను అత్యావసర వినియోగానికి ఆమోదించిన విషయం తెలిసిందే. సినోఫామ్, ఫైజర్-బయోఎన్టెక్, స్పుత్నిక్ వీ, ఆక్స్ఫర్డ్-అస్ట్రాజెనెకా టీకాలకు ఆమోదం తెలిపింది.
Updated Date - 2021-06-20T14:32:16+05:30 IST