బైడెన్ సర్కార్ కొలువుదీరిన వేళ.. భారత ఐటీ నిపుణులకు గుడ్న్యూస్
ABN, First Publish Date - 2021-01-21T17:22:27+05:30
అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం కొలువుదీరడం భారత ఐటీ నిపుణుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
వాషింగ్టన్: అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం కొలువుదీరడం భారత ఐటీ నిపుణుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. తాము అధికారంలోకి వస్తే వలస నిబంధనలను ప్రక్షాళన చేసి, వీసా విధానాలను మరింత సరళతరం చేస్తామని బైడెన్ హామీ ఇవ్వడమే దీనికి కారణం. దీనికోసం యూఎస్ సిటిజెన్షిప్ యాక్ట్ 2021ను తీసుకువస్తామని బైడెన్ చెప్పారు. అలాగే అమెరికాలో విదేశీయులకు శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్కార్డుల జారీ విషయంలో ప్రస్తుతం దేశాల వారీగా ఉన్న పరిమితులను(కంట్రీ క్యాప్) ఎత్తివేస్తామనేది కూడా బైడెన్ ఎన్నికల హామీలో ఉంది. ఇప్పుడు బైడెన్ సర్కార్ కొలువుదీరడంతో ఈ సమగ్ర వలస బిల్లును కాంగ్రెస్ ఆమోదానికి పంపనుందని తెలుస్తోంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే ఏళ్ల తరబడి గ్రీన్కార్డుల కోసం వేచిచూస్తున్న భారత ఐటీ నిపుణులతో పాటు ఇతర వృత్తుల వారికి భారీ ఊరట లభిస్తుంది. అటు అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న వలసదారులకు ఊరటనిచ్చే మరో కీలక బిల్లును కూడా బైడెన్ ప్రతిపాదించనున్నారని సమాచారం. సుమారు కోటి 10 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. వీరికి ఎనిమిదేళ్లలో చట్టబద్ధత కలిగించేలా ఈ బిల్లు ఉండనుంది. దీంతో ట్రంప్ హయాంలో కఠిన వలస విధానాలతో విసిగిపోయిన వలసదారులకు బైడెన్ నిర్ణయం పెద్ద ఊరట అనే చెప్పాలి.
Updated Date - 2021-01-21T17:22:27+05:30 IST