10 ఏళ్ల తరువాత భారత్లోకి ఎంట్రీ.. ఏకంగా టాటాలతో పోటీ.. అమెరికన్ కంపెనీ ‘నాన్ స్టాప్’ దూకుడు..
ABN, First Publish Date - 2021-11-19T23:45:15+05:30
భారత్, అమెరికా మధ్య విమానప్రయాణాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో అమెరికన్ ఎయిర్లైన్స్ మళ్లీ దేశీ మార్కెట్లోకి ప్రవేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, అమెరికా మధ్య విమానప్రయాణాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో అమెరికన్ ఎయిర్లైన్స్ మళ్లీ దేశీ మార్కెట్లోకి ప్రవేశించింది. గత వారమే..న్యూయార్క్, న్యూఢిల్లీ మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభించింది. పదేళ్ల క్రితం భారత్ నుంచి నిష్క్రమించిన అమెరికన్ ఎయిర్ లైన్స్ ఈ మారు మరింత దూకుడుగా ముందుకెళుతోంది. దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముంబై నుంచి అమెరికాకు నాన్-స్టాప్ విమాన సర్వీసును అందుబాటులోకి తేవాలనేది కంపెనీ ముఖ్య లక్ష్యాల్లో ఒకటి.
ఈ క్రమంలో.. టాటాలతో తీవ్ర పోటీ ఉంటుందని అమెరికన్ ఎయిర్లైన్స్ భావిస్తోంది. అయితే.. భారత్లోని తమ కుటుంబసభ్యులను, బంధువులను కలుసుకునేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్న ప్రవాసీ భారతీయుల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని అమెరికన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. ‘‘ఉత్తర అమెరికాలో చదువుకుంటున్న అనేక మంది భారతీయులు స్వదేశానికి పలుమార్లు వచ్చి వెళతారు. అంతేకాకుండా..అక్కడ అనేక మంది ప్రవాసీ భారతీయులు స్థిరపడ్డారు. ఈ వర్గంపైనే మేము దృష్టి పెట్టాం’’ అని సంస్థ సేల్స్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ టామ్ లాటిగ్ వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికన్ ఎయిర్లైన్ వచ్చే ఏడాది నుంచి బెంగళూరు సియాటిల్ మధ్య కూడా ఓ సర్వీసు ప్రారంభించనుంది.
Updated Date - 2021-11-19T23:45:15+05:30 IST