శంషాబాద్ ఎయిర్పోర్టులో Kuwait వెళ్తున్న 44 మంది మహిళలు అరెస్ట్.. కారణమిదే!
ABN, First Publish Date - 2021-12-08T13:13:46+05:30
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి నకిలీ వీసాల ముఠా బాగోతం వెలుగుచూసింది.
నకిలీ వీసా ముఠా గుట్టురట్టు!
శంషాబాద్ రూరల్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి నకిలీ వీసాల ముఠా బాగోతం వెలుగుచూసింది. ఏకంగా 44 మంది మహిళలను నకిలీ వీసాలతో కువైట్ పంపేందుకు ఓ ముఠా యత్నించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళా ప్రయాణికులు కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తుండగా వీరిలో కొందరు ఆందోళనతో కనిపించారు. వారి వద్ద ఉన్న పత్రాలు కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఎయిర్పోర్టు ఇమిగ్రేషన్ అధికారులు లోతుగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. మహిళల వద్ద ఉన్న ఎంప్లాయ్మెంట్ వీసా, విజిట్ వీసాలు నకిలీవని తేలడంతో అధికారులు మహిళలందరినీ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ వీసాల దందాలో హైదరాబాద్, చెన్నైకి చెందిన కొందరు ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2021-12-08T13:13:46+05:30 IST