రేపు లోక్సభలో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు
ABN, First Publish Date - 2021-11-28T08:29:43+05:30
సాగు చట్టాలను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈనెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
- అన్నదాతల ‘చలో పార్లమెంట్’ వాయిదా
న్యూఢిల్లీ/కోల్కతా, నవంబరు 27: సాగు చట్టాలను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈనెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సాగు చట్టాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలి బిల్లును పాస్ చేసింది. ఆ బిల్లును కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్లు జారీచేశాయి. ఆరోజు సభకు హాజరు కావాలని ఎంపీలను ఆ రెండు పార్టీలు ఆదేశించాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రె్సతో సమన్వయం చేసుకునే విషయంలో తమకు ఆసక్తి లేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తెలిపింది. అయితే ప్రజా ప్రయోజనార్థం వివిధ అంశాలపై ఇతర పార్టీలతో కలిసి సమన్వయం చేసుకుంటామని పేర్కొంది. కాగా సాగు చట్టాలను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నందున రైతు సంఘాలు 29న నిర్వహించ తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి.
Updated Date - 2021-11-28T08:29:43+05:30 IST