లాక్డౌన్ పెట్టినా ఆందోళన ఆపబోం: రాకేశ్ టికాయత్
ABN, First Publish Date - 2021-04-07T21:22:20+05:30
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా ఢిల్లీలోని సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే కోవిడ్ విజృంభన మళ్లీ పెరగడంతో ఆందోళన కొనసాగుతుందా ఆగుతుందా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. రైతు సంఘాల నేతలు, ఆందోళన చేస్తున్న రైతులు కూడా ఈ విషయమై సతమతమవుతున్నారు
లఖ్నవూ: కరోనా వైరస్ వ్యాప్తి రెండవ దశ ప్రారంభమై దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మహారాష్ట్రలో ఈ ప్రభావం మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొద్దిపాటి ఆంక్షలతో లాక్డౌన్లు విధించాయి. ఈ తరుణంలో మళ్లీ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పటికీ తమ ఆందోళన ఆపబోమని రైతు సంఘాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనను లాక్డౌన్ అడ్డుకోలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే కోవిడ్ మళ్లీ విజృంభించడంతో ఆందోళన కొనసాగుతుందా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. రైతు సంఘాల నేతలు, ఆందోళన చేస్తున్న రైతులు కూడా ఈ విషయమై సతమతమవుతున్నారు. సీఏఏ-ఎన్ఆర్సీలకు వ్యతరేకంగా చేపట్టిన షహీన్బాఘ్ నిరసన కోవిడ్ కారణంగానే ముగిసిపోయింది. ఇప్పుడు రైతుల ఆందోళన కూడా కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఆగిపోతుందేమోననే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఈ విషయమై టికాయత్ మాట్లాడుతూ ‘‘రైతుల ఆందోళనను మరో షహీన్బాఘ్ కానివ్వం. లాక్డౌన్ విధించినప్పటికీ మా ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం సూచించే అన్ని రకాల కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే రైతుల ఆందోళనను కొనసాగిస్తాం’’ అని అన్నారు.
Updated Date - 2021-04-07T21:22:20+05:30 IST