మమతపై బీజేపీ నేత బాబుల్ సుప్రియో దారుణ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-05-03T01:51:21+05:30
పశ్చిమ బెంగాల్కు జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ పార్టీ ఘన విజయం సాధించడంపై
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార తృణమూల్ పార్టీ ఘన విజయం సాధించడంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు ఒక క్రూరమైన మహిళకు ఓటేశారని, ఇది చారిత్రక తప్పిదమని ఫేస్బుక్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమతను క్రూరమైన మహిళగా పోల్చడం తీవ్ర వివాదాస్పదం అయింది.
‘‘నేను మమతను అభినందించడం గానీ, ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని కానీ చెప్పబోను. నిజంగా చెప్పాలంటే బెంగాల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకుండా అవినీతి, అసమర్థ, నీతి తప్పిన ప్రభుత్వాన్ని, ఓ క్రూరమైన మహిళకు ఓటేసి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి బెంగాల్ ప్రజలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
బాబుల్ సుప్రియో ఆ తర్వాత ఈ పోస్టును డిలీట్ చేశారు. అయితే, సుప్రియో కేబినెట్ సహచరులు మాత్రం మమత విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్నాథ్సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు మమత సాధించిన ల్యాండ్స్లైడ్ విక్టరీకి అభినందనలు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ నలుగురు ఎంపీలను శాసనసభ ఎన్నికల బరిలోకి దింపింది. టోలీగంజ్ నుంచి బరిలోకి దిగిన సుప్రియో తృణమూల్ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Updated Date - 2021-05-03T01:51:21+05:30 IST