టీకాలున్నాయిగా..! రెండో డోసు పెంచండి
ABN, First Publish Date - 2021-10-20T08:28:09+05:30
‘‘మీ దగ్గర రెండో డోసు వేసేందుకు సరిపడా టీకాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కానీ, మలి డోసు పొందనివారు ఇంకా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ పంపిణీ చేసేందుకు అవసరమైతే మరిన్ని టీకాలివ్వగలం.
రాష్ట్రాల అధికారులతో సమీక్షలో కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, అక్టోబరు 19: ‘‘మీ దగ్గర రెండో డోసు వేసేందుకు సరిపడా టీకాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కానీ, మలి డోసు పొందనివారు ఇంకా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ పంపిణీ చేసేందుకు అవసరమైతే మరిన్ని టీకాలివ్వగలం. రెండో డోసు వ్యాక్సినేషన్ను వేగిరం చేయండి’’ అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/యూటీలకు సూచించింది. రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమ డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ మేరకు మార్గ నిర్దేశం చేశారు. కాగా, యాక్టివ్ కేసుల పరంగా టాప్-10లో ఉన్న రాష్ట్రాల్లో.. వైరస్ వ్యాప్తి రేటును తెలిపే ‘‘ఆర్ విలువ’’ గత నెలాఖరు నుంచి 1 దిగువనే ఉందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ తెలిపింది. దీంతోపాటు సెప్టెంబరు 25 నుంచి ఈ నెల 18 వరకు దేశంలో ఆర్ విలువ 0.90గా ఉందని పేర్కొంది. ఆర్ విలువ 1 దాటితేనే ప్రమాదకరమని భావిస్తారు. కాగా, కోల్కతా, బెంగళూరులో మాత్రమే ఇది 1పైన ఉంది. మరోవైపు దేశంలో సోమవారం 13,058 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గత 231 రోజుల్లో ఇవే అతి తక్కువ. 164 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 1.83 లక్షలకు తగ్గాయి.
Updated Date - 2021-10-20T08:28:09+05:30 IST