బాలికల కోసం అన్అకాడమీ ‘శిక్షోదయ’
ABN, First Publish Date - 2021-12-07T05:48:25+05:30
భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్అకాడమీ దేశవ్యాప్తంగా తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘శిక్షోదయ’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్అకాడమీ దేశవ్యాప్తంగా తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘శిక్షోదయ’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా అన్అకాడమీ‘బేటీ సంగ్ బులందీ కీ ఓర్’ను నేరవేర్చనుంది . దీని ద్వారా భారతదేశ వ్యాప్తంగా 5 లక్షల మంది బాలికల విద్యకు తోడ్పడటంతో పాటుగా ప్రతిభావంతులైన విద్యార్ధినిలకు సాధికారితనూ అందించనుంది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యను ఆపేసిన బాలికలు, ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చేరడంతో పాటుగా ప్రధానస్రవంతి విద్యలో మిళితమయ్యేందుకు తగిన అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ ‘‘ఈ భారీ కార్యక్రమం ఐదు లక్షల మంది బాలికలలో పరివర్తన తీసుకురావడంతో పాటుగా వారి కుటుంబాలు, సమాజంపై కూడా సానుకూల ప్రభావం చూపగలదు. తద్వారా దేశంపై కూడా ప్రభావం చూపుతుంది. సృజనాత్మక, అందుబాటు ధరలలోని పద్ధతుల ద్వారా విద్యను సమూలంగా మార్చే సామర్థ్యం ఎడ్టెక్కు ఉంది. అంతేకాదు, ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను పొందేందుకు శక్తివంతమైన పాత్రనూ ఇది పోషిస్తుంది. అన్అకాడమీ, ఈ సాంకేతిక శక్తిని వినియోగించుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో సైతం నాణ్యమైన విద్యను అందించగలదు. శిక్షోదయ అనేది ఓ మహోన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అన్అకడామీ కేవలం బాలికలు ఉద్యోగం పొందేందుకు తోడ్పడటం మాత్రమే కాదు, అదే సమయంలో పాఠశాల విద్య ఆపేసిన బాలికలు తమంతట తాము సంపాదించుకోగలరనే భరోసానూ అందిస్తుంది’’ అని తెలిపారు.
మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ మోహన్దాస్ పాయ్ మాట్లాడుతూ ‘‘మహిళలకు విద్యనందిస్తే అది వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను వారు ధైర్యంగా అధిగమించేందుకు తోడ్పడుతుంది. మనమంతా ఇప్పుడు విస్తృతస్థాయి డిజిటల్ పరివర్తన మార్గంలో ఉన్నాము. ఇంటర్నెట్తో డిజిటల్ అభ్యాస వేదికలు, మొబైల్ ఫోన్ ఆఫరింగ్స్కు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. మహిళా అక్ష్యరాస్యత, ఉద్యోగాలలో మహిళలు పాల్గొనడం, ఆర్థిక సమ్మిళితం వంటివి ఆర్ధిక పురోగతిలో అత్యంత కీలకమైన విభాగాలుగా దేశంలో నిలుస్తున్నాయి. విద్య వీటికి మూలస్తంభంగా ఉంటుంది. సాధికారిత దిశగా విద్య చక్కటి తోడ్పాటును అందిస్తుంది. అన్అకాడమీ ప్రారంభించిన ఈ కార్యక్రమం మరిన్ని స్టార్టప్స్కు స్ఫూర్తినందించంతో పాటుగా జాతి నిర్మాణంలో తోడ్పాటునందించనుంది’’ అని పేర్కొన్నారు.
అన్అకాడమీ గ్రూప్ సీఈవో గౌరవ్ ముంజాల్ మాట్లాడుతూ.. ‘‘అన్అకాడమీ లక్ష్యమెప్పుడూ కూడా అత్యున్నత నాణ్యత కలిగిన విద్యను ప్రతి ఒక్కరికీ, వారి భౌగోళిక, ఆర్ధిక హోదాలతో సంబంధం లేకుండా అందించడం. మనం మన 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలలోకి అడుగుపెడుతున్న వేళ, మహిళా సాధికారిత అనేది సమాజంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సైతం అత్యంత కీలకంగా నిలుస్తుంది. సాంకేతిక ఆధారిత సామాజిక సమానత్వం, విద్య అనేవి రెండు శక్తి చోధకాలు అని మేము నమ్ముతున్నాము. అది మనల్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ దిశగా తీసుకువెళ్తుంది. శిక్షోదయతో, మేము ఈ మార్పుకు తోడ్పాటును అందించాలనుకుంటున్నాము.’’ అని చెప్పారు.
Updated Date - 2021-12-07T05:48:25+05:30 IST