టీఎంసీ గూటికి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు..?
ABN, First Publish Date - 2021-02-09T00:53:13+05:30
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నుంచి బీజేపీకి వలసలు పెరిగిన..
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నుంచి బీజేపీకి వలసలు పెరిగిన నేపథ్యంలో టీఎంసీకి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. గతంలో టీఎంసీ నుంచి పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సోమవారంనాడు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు సునీల్ సింగ్, బిస్వజిత్ దాస్ నేరుగా సీఎం ఛాంబర్కు వెళ్లి ఆమెను కలుసుకున్నారు. దీంతో ఈ ఇద్దరూ తిరిగి టీఎంసీ గూటికి చేరుకోనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు వీరిరువురూ టీఎంసీని వీడి బీజేపీలో చేరారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు మమతా బెనర్జీ సోమవారంనాడు హాజరుకావడానికి ముందు సునీల్ సింగ్, బిస్వజిత్ దాస్ ఆమెను కలుసుకున్నారు. బిస్వజిత్ దాస్ నేరుగా మమతకు పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. 20 నిమిషాల పాటు వీరు సమావేశమయ్యారు. అనంతరం సునీల్ సింగ్ విజయ సంకేతాలిస్తూ అసెంబ్లీకి బయలుదేరారు. తమ సమావేశం వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. బిస్వజిత్ దాస్ మాత్రం ఆచితూచి స్పందించారు. మమతా బెనర్జీ అధికార పార్టీ నేత అని, తన నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చించేందుకు సీఎంను కలుసుకున్నానని సమాధానం చెప్పారు. సీఎంతో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్న టీఎంసీ నేతలను ఈ విషయం ప్రశ్నించినప్పుడు 'వేచి చూడండి' అంటూ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యేల చేరికపై పరోక్ష సంకేతాలిచ్చారు.
Updated Date - 2021-02-09T00:53:13+05:30 IST