నేడు100 కోట్ల డోసులకు..
ABN, First Publish Date - 2021-10-21T08:08:56+05:30
దేశంలో వ్యాక్సినేషన్ మరో కీలక మైలురాయికి చేరనుంది. టీకా కార్యక్రమంలో వినియోగించిన డోసుల..
వ్యాక్సినేషన్పై కేంద్రం ముమ్మర ప్రచారం
రష్యాలో 1,028 మంది మృతి.. బ్రిటన్లో
43,738 కొత్త కేసులు
న్యూఢిల్లీ, అక్టోబరు 20: దేశంలో వ్యాక్సినేషన్ మరో కీలక మైలురాయికి చేరనుంది. టీకా కార్యక్రమంలో వినియోగించిన డోసుల సంఖ్య అక్టోబరు 21 (గురువారం) నాటికి 100 కోట్లు దాటనుంది. దేశం సాధించిన ఈ ఘనతను అంతటా చాటిచెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, విమానాలు, ఓడల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ విజయాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటించాలని సర్కారు యోచిస్తోంది. దీన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసులకు చేరిన ఘట్టంపై గాయకుడు కైలాశ్ ఖేర్ ఆలపించిన పాటను, ఒక ఆడియో-విజువల్ ఫిల్మ్ను ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేయనున్నారు. ఇక బుధవారం సాయంత్రం నాటికి దేశంలో 99.54 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్ జరిగింది.
పొరుగుదేశం చైనా 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ రికార్డును జూన్ నెలలోనే నమోదుచేసింది. ఇప్పుడు దాని తర్వాతి స్థానంలో భారత్ నిలువనుంది. కాగా దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 229 రోజుల కనిష్ఠానికి తగ్గి 1,78,098కి చేరింది. గత 24 గంటల్లో 14,623 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లు దాటింది. మరో 197 మంది మృతిచెందడంతో మొత్తం కరోనా మరణాలు 4.52 లక్షలు దాటాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్న డిజిటల్ వేదిక ‘కొవిన్’కు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకునేందుకు సిద్ధమని భారత్ ప్రకటించింది. ‘సైబర్ సెక్యూరిటీ - శాంతి భద్రతలు’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన ఓపెన్ డిబేట్లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింఘ్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక గత వారంలో భారత్లో కొత్త కొవిడ్ కేసుల సంఖ్య 18 శాతం తగ్గగా, మరణాలు 13 శాతం తగ్గాయని డబ్ల్యూహెచ్వో బుధవారం వెల్లడించింది.
సవరించిన మార్గదర్శకాలు 25 నుంచి
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించిన కొవిడ్ మార్గదర్శకాలను భారత్ బుధవారం సవరించింది. భారత్తో పరస్పర టీకా ఆమోద ఒప్పందాన్ని కుదుర్చుకున్న దేశాలకు ఈ విషయంలో పలు సడలింపులు కల్పించింది. ఈ జాబితాలోని 11 దేశాల (బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగరీ, సెర్బియా) నుంచి వచ్చే వారు రెండు డోసుల టీకా తీసుకొని ఉంటే వెంటనే విమానాశ్రయం నుంచి పంపించేస్తారు. అయితే ‘ఆర్టీ-పీసీఆర్’ పరీక్ష ‘నెగెటివ్’ నివేదికను చూపించడం తప్పనిసరి. ఈ మార్గదర్శకాలు అక్టోబరు 25 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా గత 24 గంటల్లో రష్యాలో 1,028 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఈనెల 30 నుంచి ఒకవారం పాటు నాన్వర్కింగ్ డేగా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. బ్రిటన్లో మంగళవారం 43,738 కొత్త కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ నివేదిక తప్పనిసరి కాదు
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టును చూపించాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ బుధవారం భారత ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఫోన్చేశారు. కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో అత్యవసర వినియోగ అనుమతి, విదేశాలకు కొవిషీల్డ్ టీకా ఎగుమతుల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చించారు. టీకా పంపిణీలో అసమానత్వాన్ని నిర్మూలించేందుకు కొవిషీల్డ్ ఎగుమతులను భారత్ వేగవంతం చేయాలని టెడ్రోస్ గుర్తుచేశారు. కొవిడ్పై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు (హెల్త్కేర్ వర్కర్లు) బీమా పథకాన్ని ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద మరో 180 రోజులకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టులో వారానికి రెండు రోజుల ప్రత్యక్ష విచారణ తప్పని సరి చేయకూడదని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ జరనపాలని సీనియర్ న్యాయవాదులు సూచించారు.
Updated Date - 2021-10-21T08:08:56+05:30 IST