భారత విదేశాంగ విధానాన్ని సమీక్షించాల్సిన తరణమిదే: పవార్
ABN, First Publish Date - 2021-08-17T01:08:45+05:30
భారతదేశ విదేశాంగ విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు..
ముంబై: భారతదేశ విదేశాంగ విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఇటీవల కాలంలో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో కూడా ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయని అన్నారు. దేశ విదేశాంగ విధానాన్ని, ముఖ్యంగా పొరుగుదేశాలతో సంబంధాలకు సంబంధించి సమీక్ష జరపాల్సిన తరుణం ఇదేనని అన్నారు. ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లు పాగా వేసిన నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.
''ఒకప్పుడు పాకిస్థాన్, చైనాతో మినహాయిస్తే పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండేలా భారత విదేశాంగ విధానం ఉండేది. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. పొరుగుదేశాలతో సంబంధాలు ఏవిధంగా మెరుగుపరుచుకోవాలనే విషయమై సమర్ధవంతమైన సమీక్ష జరిపేందుకు ఇదే తగిన సమయం'' అని పవార్ అన్నారు. ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంపై అడిగిన ప్రశ్నకు ఇది చాలా సున్నితమైన అంశమని ఆయన సమాధానమిచ్చారు. అయితే జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ బాసటగా ఉంటుందని అన్నారు.
Updated Date - 2021-08-17T01:08:45+05:30 IST