అనారోగ్యంతో కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత
ABN, First Publish Date - 2021-05-18T18:13:18+05:30
ఈయన కుటుంబానికి మంచి పేరుంది. ఈయన సొంతూరు
హైదరాబాద్/అడయార్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ తులసి అయ్య వాండయార్ (93) కన్నుమూశారు. కావేరీ డెల్టా జిల్లాల్లో ఈయన కుటుంబానికి మంచి పేరుంది. ఈయన సొంతూరు తంజావూరు జిల్లాలోని పూండి గ్రామం. గత కొన్ని రోజులుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దీంతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, సోమవారం ఉదయం కన్ను మూశారు. ఆ తర్వాత తులసి అయ్యవాండయార్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో సొంతూరుకు తరలించారు. ఇంటి దగ్గర కొద్దిసేపు ఉంచి సోమవారం సాయంత్రమే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈయనకు భార్య పద్మావతి, కుమారుడు కృష్ణస్వామి వాండయార్, భువనేశ్వరి అనే కుమార్తె ఉన్నారు. ఇందులో కృష్ణస్వామి వాండయార్ తంజావూరు దక్షిణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈయన కుమారుడు రామ నాథన్కు, అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దిన కరన్ కుమార్తె జయహారిణికి వచ్చే నెలలో వివాహం జరగాల్సివుంది. ఇదిలా వుండగా గాంధేయ వాది అయిన తులసి.. సమాజసేవలోనూ నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఈయన 1956లో పుష్పం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించి ఏటా వెయ్యి మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించేవారు. గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి వాటిని పాటిస్తూ వచ్చిన తులసి.. గాంధీ చూపిన మార్గంలోనే సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఈయన 1991-96లో తంజావూరు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా విజ యం సాధించారు. ఐదేళ్ళుపాటు ఎంపీగా ఉన్నప్పటికీ... కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు దూరంగా ఉండి తన సొంత ఖర్చులపై ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని వచ్చేవారు. గాంధీకి పరమ శిష్యుడిగా భావించిన తులసి... జాతిపిత శుక్రవారం చనిపోతే, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వరకు మౌనవ్రతం పాటించిన ఆయన. దీనిని ఒక దినచర్యగా భావించి ఆచరించారు. అలాంటి గాంధేయవాది తులసి అయ్య వాం డయార్ కన్నుమూయడంతో పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
Updated Date - 2021-05-18T18:13:18+05:30 IST