మా సీఎం యూజ్లెస్ అని ఓ పార్టీ చెప్పడం ఇదే తొలిసారి : కేజ్రీవాల్
ABN, First Publish Date - 2021-07-11T19:42:22+05:30
ఉత్తరాఖండ్లో 70 ఏళ్ళలో జరగని పనులు ఢిల్లీలో పూర్తయిపోయాయని
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో 70 ఏళ్ళలో జరగని పనులు ఢిల్లీలో పూర్తయిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రానికి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకురావాలని ఉత్తరాఖండ్ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. మంచి పాఠశాలలను నిర్మిస్తామని, విద్యుత్తు, నీరు, వ్యవసాయం, ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజలకు నమ్మకం కలిగించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షాలకు ఓ నాయకుడే లేరని అన్నారు. ఓ నాయకుడిని ఎంపిక చేసుకోవడం కోసం వారు (బీజేపీ నేతలు) ఢిల్లీకి గత నెలలో వచ్చారన్నారు. ఉత్తరాఖండ్ ప్రజల అభివృద్ధి గురించి ఎవరు ఆలోచిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ ప్రజల గురించి ఈ పార్టీలకు శ్రద్ధ ఉందా? అని అడిగారు. వాళ్ళు (బీజేపీ నేతలు) దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. వాళ్ళు కేవలం అధికారం కోసం కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఉత్తరాఖండ్ను నాశనం చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ రాష్ట్ర నేతలు వదులుకోవడం లేదన్నారు. 2000 నుంచి ఒక పార్టీ తర్వాత మరొక పార్టీ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాయన్నారు. అధికార పార్టీకి ముఖ్యమంత్రి కాదగిన నేత లేరన్నారు. తమ ముఖ్యమంత్రి యూజ్లెస్ అని ఓ పార్టీ చెప్పడం 70 ఏళ్ళలో ఇదే తొలిసారి అని దుయ్యబట్టారు.
మరికొద్ది నెలల్లో ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించేందుకు ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్యుత్తు అందజేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
Updated Date - 2021-07-11T19:42:22+05:30 IST