ఉమ్మడి పౌర స్మృతి ఉండాల్సిందే
ABN, First Publish Date - 2021-07-10T07:54:38+05:30
‘‘ఆధునిక భారత దేశంలో ప్రజలు సజాతీయులుగా మారుతున్నారు. సంప్రదాయ, కుల, వర్గ, మతపరమైన అంశాల ఎల్లలను యువత ఛేదిస్తోంది.
- ఆ దిశగా చర్యలు తీసుకోండి
- కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు
- ఆధునిక భారతంలో సజాతీయులుగా ప్రజలు
- కుల, మత ఎల్లలను చెరిపివేస్తున్న యువత
- కుల, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి
- చట్టాల్లో వైరుధ్యాలతో ప్రజల మధ్య ఘర్షణలు
- పౌర స్మృతి అమలుతోనే ఏకీకృత విధానాలు
- ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభా సింగ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 9: ‘‘ఆధునిక భారత దేశంలో ప్రజలు సజాతీయులుగా మారుతున్నారు. సంప్రదాయ, కుల, వర్గ, మతపరమైన అంశాల ఎల్లలను యువత ఛేదిస్తోంది. కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం’’ అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఉమ్మడి పౌర స్మృతి కోసం అవసరమైన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజస్థాన్కు చెందిన గిరిజన తెగలోని ‘మీనా’ వర్గానికి చెందిన వ్యక్తులకు హిందూ వివాహ చట్టం-1955 వర్తింపునకు సంబంధించిన కేసులో బుధవారం ఇచ్చిన తీర్పులో జస్టిస్ ప్రతిభ.ఎం.సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ తీర్పు కాపీలు శుక్రవారం కేంద్ర న్యాయశాఖకు చేరాక గానీ, వివరాలు బయటకు రాలేదు.
‘‘వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా) వల్ల ఉత్పన్నమవుతున్న వైరుధ్యాలతో కక్షిదారులు న్యాయస్థానం మెట్లెక్కుతున్నారు. ఇలాంటి వైరుధ్యాల వల్ల వివాహ బంధంలోకి ప్రవేశించిన వివిధ కులాలు, వర్గాలు, మతాలకు చెందినవారు సంఘర్షణకు గురవుతున్నారు. ఒక్క పెళ్లిళ్ల విషయంలోనే కాదు.. విడాకుల సందర్భంలో, పిల్లల్ని దత్తత తీసుకోవడంలో, చివరకు వారసత్వ హక్కుల విషయంలోనూ ఈ వైరుద్ధ్యాలు అడ్డంకిగా మారుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణ మేరకు ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని సుప్రీంకోర్టు తరచూ ఉద్ఘాటిస్తూనే ఉంది. ఉమ్మడి పౌర స్మృతి ద్వారా ఆయా విషయాల్లో ఏకీకృత విధానాలు అమల్లోకి వస్తాయి. వివిధ వ్యక్తిగత చట్టాల ద్వారా ఉత్పన్నమయ్యే వైరుధ్యాలకు తెర పడుతుంది’’ అని తీర్పు సందర్భంగా జస్టిస్ ప్రతిభ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆ దిశలో చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది మార్చిలో కూడా సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో ఉమ్మడి పౌర స్మృతిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన విషయాన్ని జస్టిస్ ప్రతిభ సింగ్ గుర్తుచేశారు.
బీజేపీ ఎజెండాలో పౌరస్మృతి
ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో వేర్వేరు మతాలకు ప్రత్యేక చట్టాలున్నాయి. బీజేపీ కూడా ముందు నుంచీ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి కంకణబద్ధమై ఉంది. మేనిఫెస్టోలోని అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్ సమస్యకు పరిష్కారం, ట్రిపుల్ తలాక్ వంటి కీలకమైన హామీలను చాలా వరకు నెరవేర్చినా.. ఉమ్మడి పౌర స్మృతి అంశం మాత్రం పెండింగ్లోనే ఉంది. తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో కేంద్రం ఆ దిశలో చర్యలు తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2021-07-10T07:54:38+05:30 IST