ముందుంది ముప్పు!
ABN, First Publish Date - 2021-04-07T07:10:57+05:30
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే మొదటి వేవ్ నాటితో పోలిస్తే..
నెలలో 4.5 రెట్లు పెరిగిన మరణాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే మొదటి వేవ్ నాటితో పోలిస్తే.. ఈసారి కరోనాతో మరణించే వారి సంఖ్య కొంతతగ్గింది. గతేడాదితో పోలిస్తే వైద్య వసతులు, చికిత్సా సాధనాలు, చికిత్సపై వైద్యులకు అవగాహన పెరగడం వల్లే ఇది సాధ్యమైందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.
మాస్క్ ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలను పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కేసులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ‘వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా.. ఇక ఏం కాదు’ అనే నిర్లక్ష్య ధోరణితో ఆరోగ్యపరమైన జాగ్రత్త చర్యలను విస్మరించడం కూడా ప్రతికూలంగా పరిణమిస్తోందని చెప్పారు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే..
సెకండ్ వేవ్ తదుపరి దశల్లో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. రానున్న రోజుల్లో అది ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక మార్చి 24న రోజువారీ కేసులు 53,419 ఉండగా, ఏప్రిల్ 4కల్లా 1.03 లక్షలకు చేరాయి. అయితే ఈ వ్యవధిలో రోజువారీ కరోనా మృతుల సంఖ్యలో పెద్దతేడా లేదు.
మార్చి 24న 249, మార్చి 27న 311, మార్చి 28న 295, ఏప్రిల్ 2న 713, ఏప్రిల్ 5న 446 మంది కొవిడ్తో చనిపోయారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 రోజుల మధ్యకాలంలో దేశంలో సంభవించిన కరోనా మరణాల వారపు సగటు 425. మార్చి మొదటి వారంలో ఇది కేవలం 96 మాత్రమే. అంటే నెల కిందటితో పోలిస్తే.. ఇప్పుడు మరణాలు 4.5రెట్లు పెరిగాయన్న మాట. కేసులు క్రమంగా పెరుగుతూపోతే, సమీపకాలంలో కరోనా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేసులు వేగంగా పెరుగుతున్నా.. చాలామందికి తేలికపాటి ఇన్ఫెక్షనే సోకుతుండటంతో మరణాలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2021-04-07T07:10:57+05:30 IST