flood waterలో చిక్కుకున్న ఆవులు, పాములు...కాపాడిన అటవీశాఖ సిబ్బంది
ABN, First Publish Date - 2021-11-13T14:47:54+05:30
తమిళనాడు రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో రెస్క్యూ సిబ్బంది ప్రజలను మాత్రమే కాకుండా ఆవులు, ఇతర జంతువులు, పాములను కూడా రక్షించారు...
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో రెస్క్యూ సిబ్బంది ప్రజలను మాత్రమే కాకుండా ఆవులు, ఇతర జంతువులు, పాములను కూడా రక్షించారు. వరదలతో తల్లడిల్లుతున్న చెన్నై నగరంలో పౌర, అటవీశాఖ సహాయ సిబ్బంది ప్రజలు, మహిళలతోపాటు జంతువులను కూడా కాపాడారు. వరదనీటిలో చిక్కుకున్న వారిని సాయుధ పోలీసులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయసిబ్బంది కూలిన పెద్ద చెట్టును నరికివేస్తుండగా ఆకుల్లో నుంచి పెద్ద పాము పైకి వచ్చింది. రంగంలోకి దిగిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిపుణుడైన స్నేక్ క్యాచర్ పామును కాపాడి అడవిలో వదిలివేశారు.
వర్షాల సమయంలో విషపూరిత రకాలతో సహా 20కి పైగా పాములను రక్షించినట్లు అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు.వర్షాల సమయంలో పాములను చూసినట్లు పలు ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారి తెలిపారు. పాములను పట్టుకోవడంలో నిపుణులైన సిబ్బంది, స్వచ్ఛంద సేవకులను కూడా ప్రభుత్వం నియమించింది. వరదల్లో చిక్కుకున్న పాములను నగర పరిధిలోని మంబక్కం లేదా తిరుపోరూర్ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో సురక్షితంగా వదులుతున్నామని అటవీశాఖ అధికారులు చెప్పారు.
వరదల్లో చిక్కుకున్న ఆవులను కాపాడి వాటికి పశుగ్రాసం అందించారు. వరద సహాయ పనుల కోసం తమిళనాడు పోలీసులు 75,000 మంది సిబ్బందిని, 350 మంది కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ మెన్లను మోహరించారు. 250 మంది సభ్యుల ప్రత్యేక దళం, శిక్షణ పొందిన 364 మంది హోంగార్డులను రంగంలోకి దించారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో లైఫ్ జాకెట్లు, రెయిన్ కోట్లు, గాలితో కూడిన పడవలను ఉపయోగిస్తున్నారు.
Updated Date - 2021-11-13T14:47:54+05:30 IST