ఉత్తరాఖండ్ ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి
ABN, First Publish Date - 2021-01-24T00:54:32+05:30
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పందొమ్మిదేళ్ల సృష్టి గోస్వామి జనవరి 24న వ్యవహరించబోతున్నారు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పందొమ్మిదేళ్ల సృష్టి గోస్వామి జనవరి 24న వ్యవహరించబోతున్నారు. జాతీయ బాలికా దినోత్సవాల సందర్భంగా ఆమెకు ఈ అవకాశం లభించింది. ఆమె హరిద్వార్కు చెందినవారు, రాష్ట్ర వేసవి రాజధాని నగరం గైర్సెయిన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఆమె వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమీక్షిస్తారు.
సృష్టి గోస్వామి 2018 నుంచి బాల విధాన సభ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ఉషా నేగి మాట్లాడుతూ, జాతీయ బాలికా దినోత్సవాల సందర్భంగా ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించే అవకాశాన్ని సృష్టి గోస్వామికి కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామన్నారు. గైర్సెయిన్లోని శాసన సభ భవనంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సృష్టి శక్తిసామర్థ్యాల గురించి తమకు తెలుసునని చెప్పారు.
సృష్టి గోస్వామి బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. ఉత్తరాఖండ్కు ఒక రోజు ముఖ్యమంత్రిగా అవకాశం రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ, పరిపాలనలో ఉన్నత స్థానాలకు యువత ఎదగగలరని రుజువు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
సృష్టి గోస్వామి ఆదివారం అటల్ ఆయుష్మాన్ స్కీమ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, హోమ్స్టే స్కీమ్, ఇతర అభివృద్ధి పథకాలను సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. ముందుగా అధికారులు వివిధ ప్రభుత్వ పథకాల గురించి ఆమెకు వివరిస్తారన్నారు.
Updated Date - 2021-01-24T00:54:32+05:30 IST