Lakhimpur: మంత్రి కొడుకుని అరెస్ట్ చెయ్యాల్సిందే... అక్టోబర్ 18న రైల్ రోకో
ABN, First Publish Date - 2021-10-09T22:32:51+05:30
ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి సంఘటన కేసులో కేంద్ర
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి సంఘటన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను, ఆయన కుమారుడు ఆశిష్ను అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై నిరసన తెలిపేందుకు అక్టోబరు 18న రైల్ రోకో నిర్వహిస్తామని ప్రకటించింది. దసరా పండుగనాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలిపింది.
సంయుక్త కిసాన్ మోర్చా నేత యోగేంద్ర యాదవ్ శనివారం మాట్లాడుతూ, లఖింపూర్ ఖేరి సంఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను కూడా అరెస్టు చేయాలన్నారు. ఈ సంఘటనపై నిరసన తెలిపేందుకు అక్టోబరు 18న రైల్ రోకో నిర్వహిస్తామని, అక్టోబరు 15న దసరా పండుగనాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు.
రైతు సంఘం నేత జోగీందర్ సింగ్ ఉగ్రహాన్ మాట్లాడుతూ, కొత్త సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై ప్రభుత్వం హింసాత్మకంగా వ్యవహరిస్తోందన్నారు. తాము హింసా మార్గాన్ని అనుసరించబోమని చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాలను అరెస్టు చేయాలన్నారు.
లఖింపూర్ ఖేరీలో రైతులపై నుంచి ఓ కారు దూసుకెళ్ళిన సంఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా శనివారం విచారణకు హాజరయ్యారు.
Updated Date - 2021-10-09T22:32:51+05:30 IST