కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరం: రాహుల్
ABN, First Publish Date - 2021-08-26T22:44:25+05:30
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తుంటే, ప్రభుత్వం అమ్మకాలతో బిజీగా ఉందంటూ గురువారంనాడు ఒక ట్వీట్లో విమర్శించారు. ''పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకరం. తదుపరి వేవ్లో ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకోకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను తప్పనిసరిగా వేగవంతం చేయాలి. ప్రభుత్వం అమ్మకాలతో చాలా బీజీగా ఉన్నందున ప్రతి ఒక్కరు మీమీ జాగ్రత్తలు తీసుకోవాలి'' అని రాహుల్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, గత 24 గంటల్లో 46,144 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 607 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం కేసులు 3 కోట్ల 25 లక్షలకు పైగా నమోదు కాగా, 3 లక్షల 33 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసులో ఇది 1.03 శాతం. మొత్తం కేసుల్లో 3 కోట్ల 17 వేలకు పైగా పేషెట్లకు స్వస్థత చేకూరింది. దీంతో రివవరీ రేటు 97.63 శాతంగా ఉంది.
Updated Date - 2021-08-26T22:44:25+05:30 IST