అత్యాచారం చేసిన వ్యక్తితో పెళ్లికి సుప్రీంకోర్టు అనుమతి కోరిన బాధితురాలు
ABN, First Publish Date - 2021-08-01T00:16:42+05:30
తనపై అత్యాచారం చేసి, ఓ బిడ్డ పుట్టడానికి కారణమైన
న్యూఢిల్లీ : తనపై అత్యాచారం చేసి, ఓ బిడ్డ పుట్టడానికి కారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై సోమవారం విచారణ జరగబోతోంది.
కేరళకు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన కేసులో మాజీ కేథలిక్ ప్రీస్ట్ రాబిన్ వడక్కుంచెరి దోషిగా నిర్థరణ అయింది. ఆయనను పెళ్లి చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆ బాధితురాలు సుప్రీంకోర్టును శనివారం కోరారు. ఈ కేసులో ఆయనకు 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ 2019లో కోర్టు తీర్పు చెప్పింది. ఆయన దోషిగా నిర్థరణ కావడంతో ప్రీస్ట్హుడ్ నుంచి చర్చి డిస్మిస్ చేసింది.
కేథలిక్ కుటుంబానికి చెందిన మైనర్ బాలిక పదో తరగతి చదువుతున్న రోజుల్లో 2016 మేలో ఈ దారుణం జరిగింది. ఆమెపై అత్యాచారం చేసిన ప్రీస్ట్ వడక్కుంచెరి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమెను ఆదేశించారు. ఆమె ఎవరికీ చెప్పకుండా ప్రతి రోజూ చర్చిలో ప్రార్థనకు, పాఠశాలకు హాజరవుతూ ఉండేది. ఆమె గర్భవతి అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు సహా ఎవరూ గుర్తించలేదు.
2017 ఫిబ్రవరి 7న ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూత్తుపరంబలోని క్రీస్తు రాజా ఆసుపత్రికి తరలించారు. ఆమె గర్భవతి అని అప్పుడు తెలిసింది. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె తన తల్లికి వడక్కుంచెరి చేసిన పని గురించి తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వడక్కుంచెరిని ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ, ఆసుపత్రి బిల్లు రూ.30,000 చెల్లిస్తానని చెప్పారు. చివరికి ఆయనపై కేసు నమోదు చేసి, పోలీసులు అరెస్టు చేశారు.
Updated Date - 2021-08-01T00:16:42+05:30 IST