GSLV- F10 ప్రయోగం విఫలం వెనుక...!!
ABN, First Publish Date - 2021-08-13T08:25:00+05:30
భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఐదేళ్లలో ఆరు వరుస విజయాలు అందించిన స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ 7వ సారి అనూహ్యంగా మొరాయించింది...
- అయ్యో..‘క్రయో’!
- మొరాయించిన క్రయోజనిక్ ఇంజన్
శ్రీహరికోట(సూళ్లూరుపేట), బెంగళూరు, న్యూఢిల్లీ, ఆగస్టు 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఐదేళ్లలో ఆరు వరుస విజయాలు అందించిన స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ 7వ సారి అనూహ్యంగా మొరాయించింది. విజయం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో శాస్త్రవేత్తల్లో కలవరపాటు కలిగించింది. గురువారం ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం విఫలమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజాము 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ను ఇస్రో ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ అనంతరం 7 నిమిషాలకే అంతరిక్షంలో అదృశ్యమైపోయింది. 51.70 మీటర్ల ఎత్తు, 420 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ను స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్తో ప్రయోగించారు. మొదట ఎస్-139 ఘన ఇంధన ఇంజన్, దాని చుట్టూ అమర్చిన ద్రవ ఇంధన ఎల్-40 స్ర్టాపాన్ మోటార్లు సజావుగా పనిచేయడంతో 2.31 నిమిషాల తొలిదశ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం రెండో దశలో జీఎస్-2 ద్రవ ఇంజన్ ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా 3.55 నిమిషాలకు శాస్త్రవేత్తల నిర్ణయానుసారం రాకెట్ అగ్రభాగాన ఉపగ్రహాన్ని కప్పి ఉన్న ఉష్ణకవచం సైతం విడిపోవడంతో శాస్త్రవేత్తలు ఆనందంతో కరతాల ధ్వనులు చేశారు. రెండోదశ ఇంజన్ పనిముగిసిన వెంటనే రాజుకోవాల్సిన మూడోదశ క్రయోజనిక్ ఇంజన్(సీయూఎ్స) మొరాయించడంతో రాకెట్ రోదసిలో అదృశ్యమైపోయింది.
రాకెట్తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. 18.39 నిమిషాలు జరగాల్సిన ఈ ప్రయోగం కేవలం 7 నిమిషాల్లోనే ఇలా ముగిసిపోయింది. షార్లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు, ఇస్రో చైర్మన్ శివన్ ఈ అనూహ్య పరిణామంతో విస్తుపోయారు. సాంకేతిక వైఫల్యంతో మూడో దశ క్రయోజనిక్ ఇంజన్ జ్వలించకపోవడం వల్ల ప్రయోగం విజయవంతం కాలేదని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. అత్యంత ఆధునికమైన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-03ను ఈ రాకెట్లో పంపారు. ఉపగ్రహాన్ని తొలిసారిగా భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలన్న ఇస్రో ప్రయత్నం సఫలంకాలేదు. రాకెట్ తయారీకి రూ.250 కోట్లు, ఉపగ్రహం తయారీకి రూ.150 కోట్లు కలిపి మొత్తం రూ.400 కోట్లు ఈ ప్రయోగంలో వెచ్చించారు.
ఇస్రో కుంగిపోవద్దు: నాయర్
జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం విఫలమవడంపై ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇస్రో కుంగిపోరాదనిపేర్కొన్నారు. తిరిగి పుంజుకునే సామర్థ్యం ఇస్రోకు ఉందని ఆయన పీటీఐకి చెప్పారు. కాగా, ఈ మిషన్ను కొంతకాలం తర్వాత రీషెడ్యూల్ చేయొచ్చని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం విఫలమైన అనంతరం కె.శివన్తో తాను మాట్లాడానన్నారు.
క్రయోజనిక్ ఇంజన్లపై మళ్లీ సందేహాలు..
భారీ ఉపగ్రహాలను భూ కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఇస్రో 2001 నుంచి జీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగిస్తోంది. క్రయోజనిక్ ఇంజన్ సాంకేతిక పరిజ్ఞానంలేకపోవడంతో రష్యాతో ఒప్పందం చేసుకొని 7 క్రయోజనిక్ ఇంజన్లను తొలివిడతగా దిగుమతి చేసుకుంది. 2010 వరకు రష్యన్ క్రయోజనిక్ ఇంజన్లతో 6 జీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించినా 4 మాత్రమే విజయవంతమయ్యాయి. అనంతరం అమెరికా ఒత్తిళ్లతో క్రయోజనిక్ ఇంజన్లను సరఫరాచేసేందుకు రష్యా నిరాకరించింది. మన శాస్త్రవేత్తలు క్రయోజనిక్ ఇంజన్లను రూపొందించుకున్నారు. 2014 నుంచి 2018 వరకు దేశీయ క్రయోజనిక్ ఇంజన్లతో 6 జీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అన్నీ విజయవంతమయ్యాయి. తాజా ప్రయోగంలో క్రయోజనిక్ ఇంజన్ మొరాయించడంతో మళ్లీ ఈ ఇంజన్ల సామర్థ్యంపై శాస్త్రవేత్తల్లో అనుమానాలు మొదలయ్యాయి.
Updated Date - 2021-08-13T08:25:00+05:30 IST