సంస్కరణలతో రూ.లక్ష కోట్ల అదనపు రుణాలు!
ABN, First Publish Date - 2021-06-23T09:52:04+05:30
సంస్కరణల అమలుతో సత్ఫలితాలు వస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు.
కేంద్రం-రాష్ట్రాల భాగస్వామ్యంతోనే: ప్రధాని
న్యూఢిల్లీ, జూన్ 22: సంస్కరణల అమలుతో సత్ఫలితాలు వస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక సంస్కరణలను అమలు చేయడం ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి రూ.1.06 లక్షల కోట్లు అదనపు రుణాలు సమకూర్చుకోగలిగాయని తెలిపారు. ‘దృఢనిశ్చయం, ప్రోత్సాహకాల ద్వారా సంస్కరణలు’ శీర్షికన ఏర్పాటు చేసిన బ్లాగ్లో ఆయన ‘‘అదనంగా రూ.2.14 లక్షల కోట్లు అప్పులు తీసుకునే అవకాశం ఉం డగా.. 23 రాష్ట్రాలు 1.06 లక్షల కోట్లను తీసుకున్నాయి’’ అని మంగళవారం పేర్కొన్నారు. కొవిడ్ సంక్షోభంలోనూ కేంద్రం- రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద 2020-21కి గాను రాష్ట్రాలు అదనంగా రుణాలు తీసుకోవచ్చని కేంద్రం గత ఏడాది మేలో ప్రకటించింది. రాష్ట్రాల జీడీపీలో అదనంగా 2 శాతం అప్పులు తీసుకోవచ్చని, అందులో 1 శాతానికి మాత్రం నిర్దేశిత ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సిందేనన్న షరతు విధించింది. సంస్కరణలు అమలు చేస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రగతిశీల విధానాలు అనుసరించవచ్చని మోదీ తెలిపారు. ఈ సంస్కరణలు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఒక్కో సంస్కరణ అమలుకు .25ు చొప్పున ప్రోత్సాహకాన్ని జత చేసినట్లు తెలిపారు.
Updated Date - 2021-06-23T09:52:04+05:30 IST