కొత్త దౌత్యవేత్తలతో రాష్ట్రపతి వర్చువల్ భేటీ
ABN, First Publish Date - 2021-08-19T00:39:16+05:30
మన దేశానికి కొత్తగా వచ్చిన దౌత్యవేత్తలతో రాష్ట్రపతి రామ్నాథ్
న్యూఢిల్లీ : మన దేశానికి కొత్తగా వచ్చిన దౌత్యవేత్తలతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. హోలీ సీ, నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్, ఆస్ట్రియా రిపబ్లిక్, కొరియా రిపబ్లిక్ దౌత్యవేత్తల క్రెడెన్షియల్స్ను స్వీకరించి, వారిని అభినందించారు. భారత దేశంలో వారి పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ నాలుగు దేశాలతో భారత దేశానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. భారత్తోపాటు ఈ దేశాల ఉమ్మడి లక్ష్యం శాంతి, సౌభాగ్యాలేనని తెలిపారు. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.
ఐక్య రాజ్య సమితి సహా ఇతర అంతర్జాతీయ వేదికలపై భారత దేశం నిర్వహించే కార్యకలాపాల ఫలితంగా పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యాలు ఏర్పడుతున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. న్యాయమైన, సమానత్వంగల అంతర్జాతీయ పరిస్థితులకు భారత దేశం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న, ప్రాతినిధ్యం లేని దేశాల ప్రయోజాలను భారత దేశం దృష్టిలో ఉంచుకుంటుందన్నారు.
ఈ దేశాల దౌత్యవేత్తలు కూడా తమ దేశాల నాయకత్వం తరపున రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశంతో సంబంధాలను పటిష్టం చేసుకోవాలని తమ నేతలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-08-19T00:39:16+05:30 IST