రాబోయే చాలా దశాబ్దాలు బీజేపీవే: పీకే
ABN, First Publish Date - 2021-10-29T08:21:26+05:30
భారత రాజకీయాల్లో బీజేపీ కీలకంగానే కొనసాగుతుందని, ‘రాబోయే చాలా దశాబ్దాలపాటు’ ఆ పార్టీ ఎక్కడికీ పోదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భారత రాజకీయాల్లో బీజేపీ కీలకంగానే కొనసాగుతుందని, ‘రాబోయే చాలా దశాబ్దాలపాటు’ ఆ పార్టీ ఎక్కడికీ పోదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. బీజేపీని ప్రజలు ఇప్పటికిప్పుడు గద్దె దించుతారని రాహుల్ గాంధీ కలలు కంటున్నారని, అది జరిగేది కాదని చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ తరఫున పని చేస్తున్న ఆయన బుధవారం పణజిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ చేరతారని, ఆయన చేరికను పార్టీలో వ్యతిరేకించారని వార్తలు వచ్చాయి. గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్ చర్చలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘గెలవవచ్చు.. లేదా ఓడిపోవచ్చు. కానీ, భారత రాజకీయాల్లో బీజేపీ కేంద్రకంగానే ఉండనుంది. జాతీయస్థాయిలో ఒక్కసారి కనక 30 శాతానికిపైగా ఓట్లు సాధిస్తే.. హఠాత్తుగా కనుమరుగు కావడం జరగదు. ఒకవేళ, ప్రజలు మోదీని గద్దె దింపవచ్చు. కానీ, బీజేపీ ఎక్కడికీ పోదు’’ అని వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-10-29T08:21:26+05:30 IST