పార్లమెంటు సమావేశాలు సక్సెస్: ప్రహ్లాద్ జోషి
ABN, First Publish Date - 2021-12-22T21:13:19+05:30
పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతమయ్యాయని కేంద్రం..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతమయ్యాయని కేంద్రం ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండానే హడావిడిగా బిల్లులు ఆమోదించారని, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నాయి. షెడ్యూల్ తేదీ కంటే ఒకరోజు ముందుగా బుధవారంనాడు పార్లమెంటు సమావేశాలు నిరవధింగా వాయిదా పడ్డాయి. అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మీడియాతో మాట్లాడుతూ, నవంబర్ 29తో మొదలైన సమావేశాలు ఇవాల్టితో ముగిసాయని చెప్పారు. 24 రోజుల్లో 18 సిట్టింగ్స్ జరిగాయన్నారు. లోక్సభలో 82 శాతం, రాజ్యసభలో 47 శాతం సభాకార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. రాజ్యసభలో 9, లోక్సభలో 11 బిల్లులు ఆమోదం పొందినట్టు తెలిపారు.
నవంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, ధరల పెరుగుదలపై ప్రధానంగా చర్చించాలని సమావేశం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. దీనిపై చర్చకు ఆర్థిక మంత్రి సిద్ధంగా ఉన్నప్పటికీ చర్చ చోటుచేసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల చట్టాలకు స్పల్పంగా మార్పులు చేశామని, డెరిక్ ఒబ్రెయిన్ (టీఎంసీ ఎంపీ) సభలో ఎలా ప్రవర్తించారో అందరూ చూశారని అన్నారు.
Updated Date - 2021-12-22T21:13:19+05:30 IST